KTR: ఎప్పుడూ సాఫ్ట్గా, నైస్గా మాట్లాడే కేటీఆర్.. ప్రెస్మీట్లో ఉగ్రరూపం ప్రదర్శించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై.. మోదీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. రాజకీయపరమైన కేసులను రాజకీయంగానే ఎదుర్కొంటామని.. మోదీ ఉడతఊపులకు భయపడేది లేదన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పారు. కవిత తర్వాత కూడా దర్యాప్తు సంస్థల వేధింపులు ఉంటాయని.. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఎండగడతామని మండిపడ్డారు కేటీఆర్.
లిక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కొనేందుకు మాకు దమ్ముంది? అదానీ విషయంలో విచారణ ఫేస్ చేసేందుకు మోదీకి దమ్ముందా? అంటూ నిలదీశారు కేటీఆర్. అదానీ, మోదీల బంధంపై లై డిటెక్టర్ టెస్ట్కు ప్రధాని సిద్ధమా? ఫాంహౌజ్ కేసులో విచారణకు బీఎల్ సంతోష్ రెడీనా? అని ప్రశ్నించారు.
లిక్కర్ పాలసీ స్కామ్ అయితే.. అదానీ కోసం అనేక నిబంధనలు మార్చేయడం స్కామ్ కాదా? అంటూ పలు విషయాలను వెల్లడించారు. గుజరాత్లో మద్య నిషేధం ఉన్నా కూడా.. లిక్కర్ తాగి 42 మంది ప్రజలు చనిపోవడం పెద్ద స్కామ్ అన్నారు.
నిబంధనల ప్రకారం ఒక సంస్థకు రెండు పోర్టులకే అనుమతి ఉండగా.. ఆ రూల్ మార్చేసి అదానీకి దేశంలోని ఆరు పోర్టులు కట్టబెట్టడం అసలైన స్కామ్ అన్నారు.
గంగవరం, కృష్ణపట్నం పోర్టులు లాక్కొని అదానీకి ఇవ్వడం స్కామ్.. ముంబై ఎయిర్పోర్టును అదానీ చేతిలో పెట్టడం స్కామ్.. అదానీ పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికినా విచారణ జరపకపోవడం స్కామ్.. దేశంలో బొగ్గు చీప్గా దొరుకుతున్నా, ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచే బొగ్గు కొనాలంటూ పాలసీ తీసుకురావడం స్కామ్.. అంటూ మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు కేటీఆర్.