KCR: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరారు. శుక్రవారం మహిళా బిల్లుపై దీక్షకు రెడీ అవుతున్నారు. మరి, ఈడీ విచారణ ఎప్పుడనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కవిత ఢిల్లీ వెళ్లగానే.. కేసీఆర్ యాక్షన్లోకి దిగిపోయారు. గురువారం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. శుక్రవారం పార్టీ నేతలందరితోనూ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే.. కవిత విషయంలో ఏదో బిగ్ మూవ్ జరగబోతోందనే అనుమానం కలుగుతోంది.
శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు.. అందరితోనూ గులాబీ బాస్ భేటీ కానున్నారు. ఈ మేరకు ఆహ్వానితులందరికీ ఆదేశాలు వెళ్లాయి.
బీఆర్ఎస్ పార్టీలో ఈ తరహా విస్తృత సమావేశం జరిగే దాఖలాలు చాలా అరుదు. కవిత అరెస్ట్పై ఊహాగానాలు వస్తున్న వేళ.. కేసీఆర్ బిగ్ మీటింగ్ పెట్టడం ఆసక్తికర పరిణామం. ఇంతకీ ఆ పార్టీ మీటింగ్లో ఏం చర్చిస్తారు? బీఆర్ఎస్ విధివిధానాలపై చర్చిస్తారా? ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముచ్చటిస్తారా? లేదంటే, కవిత అరెస్ట్ అయితే పార్టీ తరఫున చేయాల్సిన యాక్షన్ ప్లాన్ను వారికి వివరిస్తారా?
కవిత విషయంపైనే చర్చించే ఛాన్స్ ఉందని అంటున్నారు. సిసోడియా అరెస్ట్ తర్వాత ఢిల్లీలో ఆప్ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసింది. బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించింది. సిసోడియాను కోర్టుకు తీసుకొస్తే.. అక్కడా గుమ్మికూడింది. అయినా, దర్యాప్తు సంస్థలు ఆ నిరసనలను పెద్దగా కేర్ చేయలేదు. దూకుడూ తగ్గలేదు. ఢిల్లీలో ఆప్ అనుభవాల నేపథ్యంలో.. ఒకవేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే.. అంతకుమించి లొల్లిలొల్లి చేసేలా కేసీఆర్ వ్యూహాలు రచించారా? ఆ వ్యూహాల అమలుపై పార్టీ నేతలకు డైరెక్షన్ ఇవ్వనున్నారా? అనే చర్చ నడుస్తోంది. మరి, గులాబీ బాస్ ఏం చేయబోతున్నారో? ఉద్యమ స్థాయిలో యాక్షన్ ప్లాన్ ఉంటుందా?