Financial Market : టెక్నాలజీ అనేది చాలావరకు అన్ని రంగాలకు లాభాలనే తెచ్చిపెడుతుంది. అందరికీ మేలే చేస్తుంది. కానీ దానికి భిన్నంగా ఇది కొన్ని రంగాలకు నష్టాన్ని ఇవ్వగలదని చెప్తున్నారు నిపుణులు. అన్ని విధాలుగా ఉపయోపడుతున్న టెక్నాలజీ.. నష్టం కలిగించిన ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ మీద పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొత్త కొత్త టెక్నాలజీలను ఆహ్వానించడంలో ఫైనాన్షియల్ మార్కెట్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ అలా జరగడం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్ల నష్టాలను చవిచూసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేలా చేస్తోంది. 21వ సెంచరీలో ప్రారంభమయిన ఈ డాట్కామ్ ట్రెండ్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్ను ఎన్నో విధాలుగా మార్చింది. అందుకే టెక్నాలజీ స్టాక్ విషయంలో ఇన్వెస్టర్లు తప్పటడుగులు వేస్తున్నారని నిపుణులు చెప్తున్నారు.
నిజానికి కొత్తగా మారుతున్న ఈ టెక్నాలజీ.. సంస్థలకు లాభం కలిగిస్తుందేమో అని ఆలోచించేలోపే నష్టాన్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఉదాహరణకు ఎలక్ట్రిక్ కార్లు అనేవి మార్కెట్ను శాసిస్తాయని అందరూ అనుకున్నారు. అది నమ్మి ఎలక్ట్రిక్ కార్ల తయారీలో నిమగ్నమయిన లూసిడ్, నికోలా, రివియాన్ లాంటి సంస్థలు ఒక్క ఏడాదిలోనే కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. లాభాల కోసం పరిగెత్తిన ఈ కంపెనీల నష్టాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ నుండి కూడా వీటికి గట్టి దెబ్బే తగిలింది.
ఇక ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీలతో పోలిస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఒక సంచలనాన్నే సృష్టించింది. అందుకే ప్రస్తుతం ఏఐను నమ్ముకున్న సంస్థలపైనే ఏఐ ఫోకస్ ఉంది. ఏఐను ఉపయోగిస్తామని మాటిచ్చిన సంస్థల షేర్ వాల్యూ రెండు రోజుల్లోనే నాలుగు రెట్లు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకే చాట్జీపీటీని ఉపయోగించడానికి ఫైనాన్షియల్ మార్కెట్ ఏ మాత్రం ఆలోచించడం లేదు. కానీ కొన్నిరోజుల్లోనే కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఏ టెక్నాలజీ అయిన కొన్నిరోజులే సెన్సేషన్గా నిలవగలదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ కోణంలోకి ఏఐ కూడా వెళ్లనుంది. ఏఐను ఉపయోగిస్తామని ప్రకటించిన మార్కెట్ సంస్థల షేర్ వాల్యూ మునుపటి కంటే దారుణంగా పడిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ముందుగా షేర్ వాల్యూ పెరగడాన్ని గమనించిన షేర్హోల్డర్స్.. ఇదే అవకాశమని తమ షేర్స్ను భారీగా అమ్ముకున్నారు. దీంతో ఒక్కసారిగా వాల్యూ చాలా పడిపోయింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద సంస్థలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదని తెలుస్తోంది. ఒక్కసారిగా మార్కెట్లో సెన్సేషన్ సృష్టించిన ఏఐ.. ఇప్పుడు సంస్థలకు నష్టాన్ని కలిగించే దిశగా వెళుతుందని నిపుణులు చెప్తున్నారు.