NTR : జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ఫ్యాన్స్ ఎక్కువ. ప్రాణంతో సమానంగా తారక్ ను వారి అభిమానిస్తారు. అభిమానులపై ఎన్టీఆర్ కూడా ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. ఫ్యాన్స్ కు ఎంతో విలువ ఇస్తాడు. వారిపై ప్రేమను కురిపిస్తాడు. తన చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో అభిమానుల గురించి ప్రత్యేక మాట్లాడతాడు. వారితో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ఉంటాడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో యంగ్ టైగర్ రేంజ్ మారిపోయింది. తన అద్భుత నటనతో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకున్నారు.
RRR మూవీలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతోంది. ఈ నెల 12 న ఆస్కార్ అవార్డుల వేడుక జరగబోతోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు RRR టీమ్ ఇప్పటికే అమెరికాలో సందడి చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లాడు. ఆస్కార్ ప్రమోషన్స్ పాల్గొని అక్కడ అభిమానులతో మాట్లాడాడు. ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
ఎన్టీఆర్ ఎమోషనల్..
“మీరు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో..దానికి రెట్టింపు ప్రేమ నాకు మీపై ఉంది. కాకపోతే నేను చూపించలేకపోతున్నా.రక్తసంబంధం కంటే గొప్పబంధం మనది. మీరందరూ నా సోదరులతో సమానం. మీ ప్రేమకు, అభిమానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే.. ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటాను’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యాడు.
యూఎస్లోని తన అభిమానులతో ఆయన కాసేపు సరదాగా గడిపారు. ఫ్యాన్స్ మీట్లో పాల్గొని అక్కడి వాళ్లందరితో ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. ‘‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టం అన్నా. ఒక్కసారి మాట్లాడతారా?’’ అని అడగ్గా తారక్ అంగీకరించారు. ఆ వ్యక్తి తన తల్లికి వీడియో కాల్ చేయగా ఆయన ఫోన్ తీసుకుని ఓ కుటుంబ సభ్యుడిలా మాట్లాడారు. ‘ఎలా ఉన్నారమ్మా. నేను బాగున్నాను. తప్పకుండా కలుద్దాం అమ్మా’ అని మాటిచ్చారు. ఈ వీడియో వైరల్గా మారింది.