Manchu Manoj : సినీ హీరోలకు, రాజకీయ నాయకులకు మధ్య స్నేహం ఉండటం సహజం. తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రిటీల కుటుంబాలతో పొలిటికల్ ఫ్యామిలీలకు సన్నిహత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మధ్య జరిగిన మంచు మనోజ్, భూమా మౌనిక వివాహానికి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. కానీ ఆ వేడుకకు వచ్చిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మంచు మనోజ్ పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కనిపించగానే తొలుత ఎవరూ పట్టించుకోలేదు. ఏదో పెళ్లికి వచ్చి ఫోటోలు దిగి రోహిత్ రెడ్డి వెళ్లిపోలేదు. వివాహం జరిగినప్పటి నుంచి కొత్త జంట తిరుమల శ్రీవారిని దర్శించుకునే వరకు వారి వెంటే ఉన్నారు. దీంతో ఆయన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వధూవరులు ఎక్కడికెళ్లినా రోహిత్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. మనోజ్, మౌనిక కర్నూలు వెళితే రోహిత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతుల ఘాట్ల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. భూమా కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. మనోజ్, మౌనిక తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే అక్కడా ప్రత్యక్షమయ్యారు. కొత్త జంటతో కలిసి మంచు ఫ్యామిలీకి చెందిన విద్యా సంస్థలను సందర్శించారు.
మంచు మనోజ్ పెళ్లి దగ్గర నుంచి ప్రతి చోట రోహిత్ రెడ్డి కనిపించడంపై సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయనే బీజేపీ దూతలను వల పన్ని పట్టించారని ఆరోపణలున్నాయి. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగానే ఈ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత రోహిత్ రెడ్డిని ఈడీ టార్గెట్ చేసింది. దీంతో మీడియాలో రోహిత్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ముందు ఆయన పేరు పెద్దగా ఎవరీ తెలియదు. ఈ కేసు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రోహిత్ రెడ్డి ఫేమస్ అయ్యారు.
మంచు మనోజ్ పెళ్లిలో రోహిత్ రెడ్డి సందడి చేయడంపై వారిద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏంటని అందరూ ఆరా తీస్తున్నారు. రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. భూమా మౌనిక కుటుంబం టీడీపీలో ఉంది. మంచు కుటుంబానికి ఏపీ సీఎం జగన్ కుటుంబంతో బంధుత్వం ఉంది. జగన్ బాబాయ్ కుమార్తె విరోనికారెడ్డి.. మంచు విష్ణు భార్య. ఇలా మంచు కుటుంబానికి పొలిటికల్ ఫ్యామిలీతో బలమైన బంధుత్వం ఉంది.
ఏపీలో పార్టీని విస్తరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే ఆంధ్రా నుంచి కొందరు నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. కానీ రాయలసీమలో ఎవరూ బీఆర్ఎస్ లో చేరిన దాఖలాలు లేవు. భూమా మౌనికకు రాజకీయాలపై ఆసక్తి ఉందని స్వయంగా మంచు మనోజ్ ప్రకటించాడు. భూమా ఫ్యామిలీ ప్రస్తుతం టీడీపీలో ఉంది. గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి టీడీపీ టిక్కెట్ వారికే దక్కే ఛాన్సు ఉంది. భూమా ఫ్యామిలీ నుంచి మరొకరికి అవకాశం లేకపోవచ్చు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న మౌనిక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ప్రస్తుతానికి ఛాన్స్ లేనట్టే. మరి భూమా మౌనిక పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా ? ఆమెను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆమెను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే ఆయన ఇలా మంచు మనోజ్, మౌనికలతో టచ్ లో ఉన్నారా? ఇలాంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మనోజ్ కు రోహిత్ రెడ్డి మంచి స్నేహితుడని తెలుస్తోంది. ఇందులో రాజకీయ కారణాలు ఏమి లేవని మనోజ్ సన్నిహితులు చెబుతున్నారు.