Womens Day: ప్రపంచ మహిళా దినోత్సవం. రోజంతా మహిళలు మరింత కీర్తించబడతారు. అతివను.. ఆహా ఓహో అంటూ నెత్తిన పెట్టుకుంటారు. మళ్లీ మర్నాటి నుంచి అంతా షరామామూలే. కేక్ కటింగ్స్, విషెష్, సన్మానాలు తదితర కార్యక్రమాలతో పాటు ఉమెన్స్ డే సందర్భంగా అనేక సంస్థలు అనేక ఆఫర్లు ఇస్తుంటాయి. ఇప్పటికే WPL మ్యాచ్ను ఫ్రీగా చూసే ఛాన్స్ ఇచ్చారు.
ఈసారి మహిళా దినోత్సవానికి భారత వాయుసేన మరింత సంచలన నిర్ణయం ప్రకటించింది. చరిత్రలో తొలిసారి.. యుద్ధక్షేత్రంలో ఓ మహిళా ఆఫీసర్కు నేరుగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించింది.
షాలిజా ధామి(Shaliza Dhami). ఎయిర్ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్. వాయుసేనలో గ్రూప్ కెప్టెన్ అంటే ఆర్మీలో కల్నల్తో సమానం. 2003లో హెలికాప్టర్ పైలట్గా భారత వాయుసేనలో చేరారు. 2,800 గంటలు హెలికాప్టర్ నడిపిన అనుభవం ఆమె సొంతం. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ యూనిట్కు ఫ్లైట్ కమాండర్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఫ్రంట్లైన్ కమాండ్ హెడ్క్వార్టర్స్లో ఆపరేషన్ బ్రాంచ్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజాగా, గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామికి పశ్చిమ సెక్టార్లోని ఫ్రంట్లైన్ కాంబాట్ యూనిట్లో కమాండ్ బాధ్యతలు అప్పగించారు. రణరంగంలో నాయకత్వ బాధ్యతను మహిళకు అప్పగించడం ఇదే మొదటిసారి. ఉమెన్స్ డే సందర్భంగా ఓ మహిళా ఆఫీసర్కు దక్కిన అత్యున్నత గౌరవం ఇది. శభాష్.. ఎయిర్ఫోర్స్..అంటూ అభినందిస్తున్నారు అంతా.