MLC: కేసీఆర్ మార్క్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్. ఎమ్మెల్యేల కోటాలో మూడు ఖాళీలు ఉండగా.. ముగ్గురి పేర్లు అనౌన్స్ చేశారు. అనుకున్నట్టుగానే కేసీఆర్ నమ్మినబంటు, తాజా మాజీ నవీన్ కుమార్కు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ వరించింది.
ఇక, ముందునుంచీ ప్రచారం జరుగుతున్నట్టుగానే.. దేశపతి శ్రీనివాస్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు కేసీఆర్. గులాబీ బాస్కు దేశపతి అత్యంత సన్నిహితుడు. ఓఎస్డీగా నిత్యం సీఎం వెంటనే ఉంటారు. గతంలో టీచర్గా పని చేస్తూ.. ముఖ్యమంత్రికి ఓఎస్డీగా చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. విషయం హైకోర్టుకు వెళ్లడం.. అలా కుదరదని తీర్పు చెప్పడంతో.. ప్రభుత్వ ఉపాధ్యాయ పదవిని వదిలేశారు దేశపతి. ఫుల్ టైమ్ కేసీఆర్ కోసమే పని చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, మంచి కవి, గాయకుడు అయిన దేశపతి శ్రీనివాస్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం అంతా ఊహించిందే. ఆయనకు అది తగిన పదవేననే చర్చ నడుస్తోంది.
ఇక మూడో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరే ఆసక్తికరంగా మారింది. చల్లా వెంకట్రామిరెడ్డి. చాలామందికి తెలీని పేరు ఇది. అనూహ్యంగా చల్లాకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు కేసీఆర్. గులాబీ బాస్ పాలిటిక్స్ అట్లుంటయి మరి. చల్లా వెంకట్రామిరెడ్డి ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. ఆలంపూర్ నుంచి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ వదిలేసుకున్నారు. గద్వాలతో పాటు పక్కనే ఉన్న కర్నూలుపైనా చల్లాకు గట్టి పట్టుంది. చల్లాతో ఏపీ పాలిటిక్స్లోకి బీఆర్ఎస్ ఎంట్రీ మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు. ఇటు పాలమూరు.. అటు కర్నూలు.. ఒక్క చల్లా వెంకట్రామిరెడ్డితో.. రెండు లక్ష్యాలు సాధించవచ్చనేది కేసీఆర్ లెక్క అంటున్నారు. అందుకే, అనూహ్యంగా చల్లాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు గులాబీ బాస్.
నవీన్, దేశపతి, చల్లాలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం కంటే కూడా.. తుమ్మల నాగేశ్వరరావుకు ఈసారి కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వకపోవడంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను వీడిపోవడంతో.. జిల్లాలో పార్టీ పట్టు సడలినట్టైంది. పొంగులేటి ఎఫెక్ట్ పడినప్పటి నుంచీ.. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా వదిలేసిన తుమ్మలకు ప్రాధాన్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు కేసీఆర్. ఖమ్మం సభ సక్సెస్ కోసం మంత్రి హరీశ్రావు స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి మరీ సహాయం కోరారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ వేదికపై తుమ్మలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. ఆ హడావుడి చూసి.. ప్రతీసారి మొండిచేయి చూపిస్తున్న తుమ్మలకు ఈసారి ఎమ్మెల్సీ ఛాన్స్ పక్కా అంటూ ప్రచారం జరిగింది. కానీ, ఈసారి కూడా తుమ్మల పేరు లేకుండా పోయింది. కేసీఆరా.. మజాకా.