AP: సీన్ 1: మహారాష్ట్రలోని పర్బని జిల్లా. కోల్వాలీ పోలీస్ స్టేషన్. గతేడాది ఓ బాలుడి మిస్సింగ్ కేసు వచ్చింది. నాలుగేళ్ల హైదర్ కనిపించడం లేదంటూ అతని తండ్రి అహ్మద్ యూనస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో మరిన్ని సంచలన విషయాలు తెలిశాయి. హైదర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన మరికొంత మంది చిన్నారులు కూడా కనిపించకుండా పోయారని పోలీసులు గుర్తించారు. ఏదో జరుగుతోందని అనుమానించారు. నిఘా వేసి.. సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు.
సీన్ 2: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. ఓ పేరున్న పాఠశాలలో వార్షికోత్సవం జరుగుతోంది. కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఓ పిల్లాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు. సడెన్గా ఆ స్కూల్కు జగ్గయ్యపేట, మహారాష్ట్రలకు చెందిన పోలీసులు వచ్చారు. ఏవో పేపర్లు చూపించారు. ఆ బాలుడిని కారులో తీసుకెళ్లిపోయారు. ఒక్కసారిగా కలకలం. స్కూల్తో పాటు స్థానికంగా సంచలనం. పోలీసులు ఆ పిల్లాడిని తీసుకెళ్లడంపైనే చర్చంతా.
సీన్ 1 కు, సీన్ 2 కు.. లింక్ ఉంది. ఈ రెండు ఘటనలు వేరువేరు చోట్ల జరిగినా.. వాటి మధ్య ఒకే క్రైమ్ యాంగిల్ దాగుంది. మహారాష్ట్రలో కనిపించకుండా పోయిన నాలుగేళ్ల హైదరే.. జగ్గయ్యపేట స్కూల్ నుంచి పోలీసులు తీసుకెళ్లిన బాలుడు. అక్కడి పిల్లాడే.. ఇక్కడ ఉన్నాడు. ఏడాది పాటు పకడ్బందీగా జరిగిన పోలీస్ యాక్షన్ తర్వాత.. మహారాష్ట్రలో హైదర్ మిస్సింగ్ కేసు.. ఇలా జగ్గయ్యపేటలో ముగిసింది. కంప్లీట్ సినిమాటిక్గా సాగిందీ ఎపిసోడ్. ఇంతకీ అసలేం జరిగిందంటే….
గతేడాది హైదర్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు.. ఆ బాలుడిని కిడ్నాప్ చేశారని గుర్తించారు. హైదర్తో పాటు మిస్ అయిన మరికొందరు పిల్లల కేసునూ కలిపి డీల్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా తప్పిపోయిన పిల్లలను.. ఇతర వ్యక్తుల దగ్గర గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. హైదర్ను కిడ్నాప్ చేసిన దుండగులు.. విజయవాడకు చెందిన శ్రావణికి అమ్మేశారని తెలిసింది. ఆ శ్రావణి ఆ పిల్లాడిని జగ్గయ్యపేటలోని ఓ మహిళ ద్వారా.. వత్సవాయి మండలం దేచుపాలెం గ్రామానికి చెందిన నాగుల్మీరా, షహీనాబేగం అనే దంపతులకు విక్రయించినట్టు తేల్చారు.
హైదర్ ఆచూకీ ఐడెంటిఫై అయ్యాక.. మహారాష్ట్రలోని పర్బని జిల్లా ఎస్పీ రాగసుధ రంగంలోకి దిగారు. విజయవాడ పోలీస్ కమిషనర్కు ఓ అఫిషియల్ లెటర్ రాశారు. బాలుడిని స్వాధీనం చేసుకోవడానికి జగ్గయ్యపేట పోలీసుల సహాయాన్ని కోరారు. అందుకు బెజవాడ సీపీ ఓకే చెప్పారు. మహారాష్ట్ర పోలీసులు, జగ్గయ్యపేట ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది.. హైదర్ చదువుతున్న స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రామ్ జరుగుతుండగా వెళ్లారు. అవసరమైన పత్రాలను చూపించి.. నాగుల్మీరా కుటుంబం పెంచుకుంటున్న బాలుడు(హైదర్)ని కారులో తీసుకెళ్లిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
పాపం.. ఆ కుటుంబం. నాగుల్మీరా, షహీనాబేగం దంపతులకు పిల్లలు లేరు. కానీ వారికి పిల్లలంటే ఎంతో ప్రేమ. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఓ దళారి బాలుడిని బేరం పెట్టింది.పిల్లలు కావాలనే కోరికతో.. డబ్బులిచ్చి ఆ బాలుడిని దత్తత తీసుకుంది నాగుల్మీరా కుటుంబం. కానీ, తాము చేస్తున్నది చట్టవ్యతిరేకమైన పని అని అప్పుడా కుటుంబానికి తెలీలేదు. పిల్లాడు వస్తే అదే చాలు అనుకున్నారు. ఏడాది నుంచి ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మంచి స్కూల్లో చదివిస్తున్నారు. ఇప్పుడా స్కూల్ నుంచే తమ పిల్లాడిని పోలీసులు తీసుకెళ్లిపోవడంతో నాగుల్మీరా జంట తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అయ్యో.. ఎంత పని జరిగిపోయిందంటూ కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ఏడాదిగా పెంచుకున్న ప్రేమ.. ఒక్కరోజులో తలకిందులు కావడం.. తమ పిల్లాడు తమకు కాకుండా పోవడం.. ఆ దంపతులను కుంగదీసింది. విషయం తెలిసి స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.