H3N2: H3N2 మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. కొన్నిచోట్ల ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొంతమంది శ్వాసతీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఈ మహమ్మారిపై స్పందించిన ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారని వెల్లడించారు. ఈ మహమ్మారి తుంపర్ల రూపంలో కోవిడ్లా వ్యాపిస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది ఈ సమయంలో వైరస్లో ఉత్పరివర్తనలు చోటుచేసుకోవడం కామన్ అని అన్నారు.
కేసులు పెరుగుతునన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని .. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాదపడే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. బహిరంగా ప్రదేశాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అలాగే లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని అన్నారు. వారిని సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ను ఉపయోగించడం ప్రమాదకరమని వెల్లడించారు.
ఇక ఫ్లూ బారిన పడకుండా మనవంతుగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులుగా ఒక్కచోట గుమికూడ కూడదు. అత్యవసర పరిస్థితిల్లో గుంపుల్లోకి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్లాలి. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే శుభ్రంగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటికి ఏదైనా అడ్డుపెట్టుకోవాలి. బహిరంగంగా ఉమ్మి వేయడం, చీదడం వంటివి ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. లక్షణాలు కినిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పలు జాగ్రత్తలు తీసుకోవాలి.