Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అటు సీబీఐ, ఇటు ఈడీ దూకుడు పెంచాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ 11 మంది నిందితులను అరెస్టు చేసింది.
రాబిన్ డిస్టిలరీస్ పేరుతో రామచంద్ర పిళ్లై వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కొంతమంది రాజకీయ నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం తెరపైకి రావడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరికొందరితో కలిసి తిరుమల సందర్శనకు వెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి.
రామచంద్ర పిళ్లై ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామచంద్ర పిళ్లైతో కలిసి వ్యాపారం చేస్తున్న వారిని టార్గెట్ చేశారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో రెండుసార్లు సోదాలు చేశారు. ఆ తనిఖీల్లో సేకరించిన వివరాల ఆధారంగా ఆయనను ఈడీ రెండురోజులపాటు ప్రశ్నించింది. తాజాగా రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేయడం ఆయనతో కలిసి వ్యాపారాలు చేస్తున్న వారిలో కలవరం రేగుతోంది. అలాగే సీబీఐ నమోదు చేసిన కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లైకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఢిల్లీ మద్యం స్కామ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను వారంరోజులపాటు ప్రశ్నించింది. ఆ తర్వాత కోర్టు సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఈడీ అధికారులు కూడా సిసోడియాను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. తీహార్ జైలులో సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలా ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీ నిందితుల చుట్టూ ఉచ్చుబిగుస్తున్నాయి. గత నెలరోజులుగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేశాయి. తాజాగా మరికొందరిని అరెస్ట్ చేస్తాయని వార్తలు వస్తున్నాయి. మరి సీబీఐ, ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరో..?