UP: వారసత్వంగా వచ్చిన ఆస్తులను తీసుకొని కొందరు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చుతుంటే.. మరికొందరు నడిరోడ్డుపైన పడేస్తున్నారు. భవిష్యత్తులో తమకూ అటువంటి రోజు వస్తుందని మర్చిపోతున్నారు. వృద్ధ వయస్సులో మనవండ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన వాళ్లు వృద్ధాశ్రమంలో రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే వృద్ధాప్యంలో తనను పట్టించుకోని తన పిల్లలకు గట్టి గణపాఠం చెప్పాడు ఓ వృద్ధుడు. తన ఆస్తినంతా ప్రభుత్వానికి ఇచ్చేశాడు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్కు చెందిన నాథూ సింగ్(85)కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నాడు. కొడుకు, కుమార్తెలు పట్టించుకోకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇటీవల ఓ వృద్ధాశ్రమానికి మారాడు. అయినా కూడా అతడిని చూడడానికి ఎవరూ రాలేదు. మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన సమయంలో వృద్ధాశ్రమంలో ఉండడం అతనికి ఏమాత్రం నచ్చలేదు.
ఈక్రమంలో వారికి బుద్ధి చెప్పాల్ని నిర్ణయించుకున్నాడు. తనకు ముజఫర్పూర్లో ఓ ఇంటితో పాటు రూ.1.5 కోట్ల ఆస్తి ఉంది. దానినంతా ప్రభుత్వం పేరిట వీలునామా రాశాడు. తాను చనిపోయాక తన స్థలంలో ప్రభుత్వాసుపత్రి లేదా స్కూల్ను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరాడు. అలాగే తన శవాన్ని కొడుకు, కుమార్తెలు తాకడానికి కూడా వీలులేదని.. వైద్యకళాశాలకు తన మృతదేహాన్ని అప్పగించాలని వీలునామాలో పేర్కొన్నాడు.