Telangana: TPCC చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ముగింపు సభ కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. బహిరంగ సభా స్థలిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ నెల 9న నిర్వహించే సభా స్థలాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు.. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ సీఎం హాజరవుతారని వారు తెలిపారు.
ఖమ్మంలోని గిరిజన సంక్షేమ భవనంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.. మైనార్టీలకు లోన్లు కేటాయింపు విషయంలో లబ్ధిదారులు ఆందోళన చేశారు.. సుమారు 3 వేల మంది మైనార్టీలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 40 మందినే ఎంపిక చశారని.. మిగతా దరఖాస్తు దారులు నిరసన తెలియజేశారు. మిగతా వారికి కూడా అవకాశం కల్పించాలని మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగారు.. దీంతో లబ్ధిదారుల కేటాయింపును మున్సిపల్ కమిషనర్ వాయిదా వేశారు.
ఆస్తి పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ చేర్యాలలో అఖిలపక్షం ధర్నా చేపట్టింది. 100 గజాల ఇంటికి ఆరు వేల ఆస్తి పన్ను మున్సిపాల్ పాలక వర్గం నిర్ణయించడంపై భగ్గుమంది. అనవసర అప్పులు చేసి పేద ప్రజల మీద రుద్దుతున్నారని మండిపడ్డారు .పెంచిన పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ర్యాగింగ్ ఆగడం లేదు. జూనియర్ విద్యార్ధులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్ధులు కొట్టారు. ఈఘటనపై బాధిత విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళనతో విషయం వెలుగులోకి వచ్చింది.
అశ్వారావుపేటలో భర్త వేధింపులు తాళలేక భార్య, ఆమె తరపు బంధువులు… పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తన చెల్లికి న్యాయం చేయాలంటూ బాధితురాలు సోదరుడు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. న్యాయం చేయాలని పీఎస్లో కేసు పెట్టినా.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు పోలీసులను ప్రభావితం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.