H3N2: కరోనా మహమ్మారి.. దాదాపు మూడు సంవత్సరాలు ప్రపంచ దేశాలను గడగడలాడించింది. కోట్లమంది ప్రాణాలు తీసింది. ఇప్పటికీ కొన్ని దేశాలు ఈ వైరస్తో వణికిపోతున్నాయి. దేశంలో ఇప్పుడిప్పుడే మహమ్మారి అంతమై సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జనాలు మాస్క్లు పెట్టుకోవడం మానేస్తున్నారు. ఈ సమయంలో మరోకొత్త ఫ్లూ పుట్టుకొచ్చి భయాందోళనక రేకెత్తిస్తోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
అదే ఇన్ఫ్లూయెంజా A సబ్టైప్ H3N2 వైరస్. దేశవ్యాప్తంగా ఈ వైరస్ కోరలు చాస్తోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వారిలో దగ్గు, గొంతునొప్పి, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అటు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. కొన్ని చోట్లు ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి.
గత రెండు, మూడునెలల్లో దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా కొందరిలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తున్నాయి. మరికొంత మంది కోలుకున్నాక న్యూమోనియా బారిన పడి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈక్రమంలో ఐసీఎంఆర్ హైఅలర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంత ప్రభావం చూపుతున్నప్పటికీ ఈ ఫ్లూతో ఆందోన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అప్రమత్తంగా ఉంటూ.. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని వెల్లడించింది. అలాగే లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. వారిని సంప్రదించకుండా ఎట్టిపరిస్థితిలోనూ యాంటీ బయోటిక్స్ వాడకూడదని తెలిపింది.
ఇక ఫ్లూ బారిన పడకుండా మనవంతుగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులుగా ఒక్కచోట గుమికూడ కూడదు. అత్యవసర పరిస్థితిల్లో గుంపుల్లోకి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్లాలి. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే శుభ్రంగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటికి ఏదైనా అడ్డుపెట్టుకోవాలి. బహిరంగంగా ఉమ్మి వేయడం, చీదడం వంటివి ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. లక్షణాలు కినిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పలు జాగ్రత్తలు తీసుకోవాలి.