Preethi case: సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసుకు సంబంధించి టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి చేరింది. అందులో ప్రతి బాడీలో ఎటువంటి విషరసాయనాలు లభ్యం కాలేదని వెల్లడైంది. ఈక్రమంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. అయితే ప్రీతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. కచ్చితంగా హత్యేనని అంటున్నారు.
ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని సోమవారం ప్రీతి తల్లిదండ్రులు హైదరాబాద్లో డీజీపీని కలిశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు తమకు టాక్సికాలజీ రిపోర్ట్ అందలేదని.. రిపోర్టు వచ్చినా కాజ్ ఆఫ్ డెత్ క్లియర్గా తెలియదని ప్రీతి తండ్రి నరేందర్ అన్నారు. టాక్సికాలజీ కోసం ప్రీతికి అప్పుడే ఎక్కించిన రక్తం నుంచి నమూనాలు తీసుకున్నారని కాబట్టి సరైన రిపోర్ట్ రాదని వెల్లడించారు.
ఇక సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఫిబ్రవరి 26న ప్రాణాలు కోల్పోయింది. రాత్రి 9.10 గంటలకు నిమ్స్ వైద్యులు ప్రీతి కన్నుమూసినట్లు ప్రకటించారు.