Rahul Gandhi: కొంతకాలంగా బీజేపీ నేతలకు దిమ్మ తిరిగేలా రాహుల్ గాంధీ కౌంటర్లు ఇస్తున్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో కాషాయ నేతల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టారు. తాజాగా మరోసారి బీజేపీ నేతలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తాజాగా బ్రిటన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రసంగంపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పొరుగు దేశం పాకిస్థాన్ కూడా ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేసే సాహసం చేయలేదని మండిపడ్డారు. భారత్ ను ప్రపంచమంతా కీర్తిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు చేసిన విమర్శలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. తనకు అన్నీ గుర్తున్నాయ్ అంటూ ప్రధాని మోదీ గతంలో విదేశాల్లో వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చిన 60 నుంచి 70 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదని విదేశాల్లో మోదీ చెప్పడం తనకు గుర్తుందని చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందని చెప్పడం తనకు గుర్తుందన్నారు. కానీ తాను ఎప్పుడూ ఇలా దేశం పరువు తీయలేదని రాహుల్ స్పష్టం చేశారు. తన మాటలను వక్రీకరించడమంటే బీజేపీ నేతలకు ఇష్టమన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసే వ్యక్తి ప్రధాని మోదీ అనేది మాత్రం వాస్తవమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆయన చేసిన ప్రసంగం మీరు వినలేదా..? ఆ మాటలతో ఆయన భారతీయులను అవమానించారంటూ రాహుల్ దీటుగా బదులిచ్చారు.
2015లో దుబాయ్లో మోదీ చేసిన వ్యాఖ్యలను అప్పట్లో కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. గతంలో భారతీయులు ఇక్కడ జన్మించినందుకు చింతిస్తూ.. దేశం విడిచివెళ్లిపోయే పరిస్థితి ఉండేదని కానీ ప్రస్తుతం మాత్రం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఆదాయం తక్కువైనా తిరిగి స్వదేశానికి రావడానికే మొగ్గుచూపుతున్నారని మోదీ అప్పట్లో చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దేశం వెనుకబడిందని మోదీ విదేశాల్లో చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ.. తాను మోదీ ప్రభుత్వం వైఫల్యాలను చెప్పడం తప్పు ఎలా అవుతుందని రాహుల్ బీజేపీ నేతలకు సూటి ప్రశ్నలు వేశారు.