Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. వివేకా హత్య కేసులో కీలకపాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు ప్రశ్నించారు.
మార్చి 6న హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ శనివారం నోటీసులు ఇచ్చింది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అయితే మార్చి 6న విచారణకు రాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు స్పష్టం చేశారు. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోతున్నానని లేఖ రాశారు. దీంతో ఆదివారం రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి మరోసారి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
జవవరి 28, ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన అధికారులు మరోసారి ఎంపీని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి చుట్టూ కూడా సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. ఆయన కూడా విచారణ హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.
విచారణకు రెడీ..
వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, గృహ సారథులు, వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. తన తండ్రి భాస్కర్రెడ్డి ఈ నెల 12న కడపలో విచారణకు హాజరవుతారని చెప్పారు. తండ్రీకొడుకుల విచారణ తర్వాత సీబీఐ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.