RC 15: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం ఆమె చేస్తోన్న చిత్రాల్లో RC 15 క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్. మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. మార్చి మూడో వారం తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అంటే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాతే షెడ్యూల్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కియారా అద్వానీ రామ్ చరణ్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
‘‘RRR రిలీజ్ తర్వాత నేను రామ్ చరణ్ను కలిశాను. ఇద్దరు కలిసి RC 15 షూటింగ్లో పాల్గొన్నాం. తను మంచి యాక్టరే కాదు.. ఎక్సలెంట్ డాన్సర్ కూడా. అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత తనలో ఎలాంటి మార్పు లేదు. తను అంత పెద్ద స్టార్ కావటానికి అదే కారణమని నేను అనుకుంటాను. అలాగే ఈ సినిమాలో శంకర్ సార్తో పని చేయటం మరచిపోలేని అనుభవం. నేను ఆయనతో సినిమా చేయాలని కలగన్నాను. అది ఈ సినిమాతో తీరింది. అయనొక అద్భుతమైన టెక్నీషియన్’’ అన్నారు కియారా అద్వాని.
RC 15 నెక్ట్స్ షెడ్యూల్లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ పాటకు ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్బంగా విడుదల చేయటానికి నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్లాన్ చేస్తున్నారు.