Chandrababu : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల ప్రహారీల కూల్చివేతలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వం తీరును టీడీపీ , జనసేన తప్పుపడుతున్నాయి. ఇప్పటికే ఇప్పటం వెళ్లి జనసేన నాయకులు బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ వైఖరిని, సీఎం జగన్ తీరును ఖండించారు.
ఏదైనా మంచి పనికోసం వెనకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారని.. కానీ కక్షపూరితంగా ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తే దాన్ని సైకోతత్వం అంటారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలమయంగా మారితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ ఇప్పటం గ్రామంలోని రోడ్డును మాత్రం విస్తరించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ నేతల తీరు ఎలాగూ మారదన్నారు. ప్రజలే వారిని మార్చేస్తారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం గ్రామంలో శనివారం మరోసారి ఇళ్ల ప్రహారీల కూల్చివేతల పనులు అధికారులు చేపట్టారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇతరులెవరూ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. కొందరి ఇళ్ల ప్రహరీలు, గేట్లను తొలగించారు. ఆటోలు సైతం రాని ఊరిలో రహదారి విస్తరణ పనులు చేపట్టాలనుకోవడం ప్రభుత్వ కక్ష సాధింపు కాదా? అని బాధితులు ప్రశ్నించారు.
తాము గతేడాది జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చినందుకే వేధిస్తున్నారని బాధితులు మండిపడ్డారు. తొలగింపు పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ప్రణాళికా విభాగం అధికారులు గతంలో నిర్దేశించిన మార్కింగ్ ప్రకారం ఇళ్ల ప్రహరీలను పొక్లెయిన్లతో తొలగించారు. ఈ ఘటనపై జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు.
గతంలోనూ ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నామని ప్రకటించింది. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కారు టాప్ పై కూర్చుని ఆ గ్రామానికి వెళ్లి బాధితులకు సంఘీభావం ప్రకటించారు. వారికి ఆర్థికసాయం చేశారు. తాజాగా గతంలో నిలిచిపోయిన కూల్చివేతలను చేపడుతున్నామని అధికారులు ప్రకటించడంతో ఇప్పటంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.