Harishrao : కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మెడికల్ కాలేజీల విషయంలో వార్ నడుస్తోంది. తప్పు తెలంగాణ ప్రభుత్వానిదే అని కేంద్రం ఆరోపిస్తోంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయలేదని చెబుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపించిందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేటాయించలేదన్నారు. అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. అప్పుడు కేంద్రం సానుకూలంగా స్పందించిందని వివరిస్తూ.. ఓ వీడియోను హరీశ్ రావు ట్విటర్లో పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో కొత్త మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదని గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు మెడికల్ కాలేజీల అంశంపై వరుస ట్వీట్లు చేశారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో కేంద్ర మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్లో కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవటం వల్లే మంజూరు చేయలేదంటున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వీడియోను ట్వీట్కు జతచేశారు. ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్కి నిధుల కొరత ఉందని హరీశ్రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ అభివృద్ధి కోసం రూ.1,365 కోట్లు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు రూ.156 కోట్లే కేటాయించటానికి కారణమేంటని ప్రశ్నించారు. గుజరాత్ ఎయిమ్స్కు కేంద్రం 52 శాతం నిధులు ఇచ్చిందని తెలిపారు. కానీ తెలంగాణ 11.4 శాతం నిధులే ఇచ్చిందని ఆరోపించారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని హరీశ్ రావు స్పష్టం చేశారు. అందువల్లే రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ కేంద్ర మంత్రులు, గవర్నర్ అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. తెలంగాణ గవర్నర్ గిరిజన యూనివర్సిటీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరగుతుందని హరీశ్ రావు అన్నారు.