Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళుతోంది. ఈ కేసు దర్యాప్తు ఏపీ నుంచి తెలంగాణకు మారిన తర్వాత సీబీఐ అధికారులు విచారణలో వేగం పెంచారు. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 6న హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు.
మార్చి 6న విచారణకు రాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సీబీఐ అధికారులు అంగీకరించలేదని సమాచారం. కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ అధికారులు అవినాష్రెడ్డిని ప్రశ్నించారు. జవవరి 28, ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన అధికారులు మరోసారి ఎంపీని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు.
మరోవైపు ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి చుట్టూ కూడా సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. ఇప్పటికే విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చింది. మార్చి 6న కడపలో విచారణకు రావాలని కోరింది. ఇంతకు ముందు మార్చి 12న విచారణకు హాజరుకావాలని భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే తాజాగా ఈ నెల 6న విచారణకు రావాలని కోరింది. మరి తండ్రీకొడుకులు విచారణకు హాజరవుతారా? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేదని ఆసక్తిగా మారింది.
మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి బెదరింపులు వస్తున్నాయి. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన భర్తను చంపుతామని కొందరు బెదిరించారని వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోపించారు. పులివెందులలోని తన ఇంటికి వచ్చి హెచ్చరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కొట్టారని, సెల్ ఫోన్ లాక్కొని కింద పడేశారని ఆరోపించారు. గాయాలుకావడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు.