Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎంను వెంటాడి వేటాడింది సీబీఐ. లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది. అయితే, కస్టడీలో సిసోడియాను అడిగిందే అడుగుతోందా సీబీఐ? తమకు కావాల్సిన విధంగా సమాచారం చెప్పించేలా ఒత్తిడి చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు సిసోడియా తరఫు న్యాయవాది.
కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు శనివారం సిసోడియాను కోర్టులో హాజరుపర్చారు. మనీశ్ సిసోదియా విచారణకు సహకరించడం లేదని.. ఆయనను మరో మూడు రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది.
సీబీఐ వాదనను సిసోడియా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తమకు కావాల్సింది చెప్పించుకునేందుకే కస్టడీని పొడిగించాలని అడుగుతున్నారని అన్నారు. కేసు విచారణకు తన క్లయింట్ సహకరిస్తున్నారని, సీబీఐ అడిగిందే మళ్లీ మళ్లీ అడుగుతూ.. సిసోడియాను మానసికంగా వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సిసోడియా కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన విషయమే పదే పదే అడగొద్దని సీబీఐకి సూచించింది. సోమవారం వరకు సీబీఐ రిమాండ్లోనే ఉండనున్నారు మనీశ్ సిసోడియా
మరోవైపు, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఆమె పక్కన ఉండాల్సిన అవసరం ఉందని.. అందుకే బెయిల్ ఇవ్వాలని కోరారు. బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ సీబీఐకి నోటీసులు కోర్టు జారీ చేసింది. కేసును మార్చి 10కి వాయిదా వేసింది. ఇక, కేంద్రం, సీబీఐ తీరుకు నిరసనగా.. మనీశ్ సిసోడియాకు మద్దతుగా.. ఢిల్లీ కోర్టు ముందు ఆప్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.