Congress: ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు ఎంపీ. గతంలో మంత్రి. స్టేట్ కాంగ్రెస్లో దాదాపు అన్ని పదవులూ అనుభవించారు. పార్టీ ఆయన్ను నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు పార్టీకి తిరిగిచ్చేయాల్సిన సమయం వచ్చింది. కానీ, ఉత్తమ్ కుమార్లో ఉత్తమ లక్షణాలు లేనట్టున్నాయి. పార్టీకి లాభం చేయకపోవడమే కాక.. మరింత నష్టం చేసే పనులు చేస్తున్నారనే విమర్శ ఉంది. కాంగ్రెస్లో ఉంటూనే సీనియర్ల పేరుతో పార్టీని డ్యామేజ్ చేసేందుకే ఉన్నారా? అనిపిస్తోంది.
రేవంత్రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డిలానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తట్టుకోలేకపోతున్నట్టున్నారు. కోమటిరెడ్డి ఆ పదవిని ఆశించారు కాబట్టి అలా వ్యవహరించారంటే అర్థం ఉంది. మరి, ఉత్తమ్కు ఏమైంది? ఏళ్ల పాటు ఆయన అనుభవించిన పదవేగా? మరొకరికి ఇస్తే తప్పేంటి? అందులోనూ రేవంత్రెడ్డిలాంటి డైనమిక్ లీడర్కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే మరింత మంచిదేగా? అయినా, ఈ సీనియర్లకు అది నచ్చలేదు. రేవంత్రెడ్డి తమకు ఏకు మేకు అవుతాడనే భయం వాళ్లది. అందుకే, గ్రూపులు కట్టి పంచాయితీ కూడా పెట్టారు. దిగ్విజయ్ సింగ్ వచ్చి సర్థి చెబితే గానీ వినలేదు.
పెద్దగా నోటికి పని చెప్పకుండానే ఉత్తమ్ కుమారుడు పెద్ద రాజకీయమే చేస్తున్నారని అంటున్నారు. సీనియర్ల గ్రూపుకు కర్త, కర్మ, క్రియ ఆయనే అంటారు. ఇక, హుజురాబాద్ ఎన్నికల సమయంలోనూ ఉత్తమ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బలమైన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారని భావించిన కౌశిక్రెడ్డిని పార్టీ వీడకుండా ఆపలేకపోయారు. వాళ్లిద్దరూ దగ్గరి బంధువు కావడం.. ఉత్తమ్ వ్యూహాత్మక మౌనం పాటించడం.. వెళ్తూ వెళ్తూ కౌశిక్రెడ్డి రేవంత్రెడ్డి మీద విమర్శలు చేయడం.. అంతా ఉత్తమ్ డైరెక్షనే అనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.
అటు, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోనూ మాజీ పీసీసీ చీఫ్ పాత్ర చాలా చాలా పరిమితం. పార్టీ గెలుపు కోసం ఆయన చేసిందేమీ లేదనే విమర్శ. ఇవి చాలవన్నట్టు.. లేటెస్ట్గా హాత్ సే హాత్ జోడో యాత్రల విషయంలో మరింత పాలి..ట్రిక్స్ చేశారని అంటున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేస్తే వెళ్లలేదు. ఇంఛార్జ్ మాణిక్ రామ్ థాక్రే వచ్చినా.. ఉత్తమ్ మాత్రం రాలేదు. పోనీలే ఏదో బిజీ అనుకున్నా.. ఇన్నాళ్లుగా రేవంత్ పాదయాత్ర చేస్తున్నా.. కనీసం ఒక్కసారి కూడా యాత్రలో పాల్గొన లేదు. భట్టి, వీహెచ్.. లాంటి వాళ్లు మధ్యలో వచ్చి వెళ్లారు కానీ ఉత్తముడు మాత్రం రాలేదు. కట్ చేస్తే.. మరింత రాజకీయం.
రేవంత్రెడ్డికి పోటీగానా అన్నట్టు.. ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రారంభించిన పాదయాత్రలో మొదటిరోజే ప్రత్యక్షమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అసలు ఉద్దేశాన్ని బహిరంగంగా చాటుకున్నారు. ఉత్తమ్ అనే కాదు.. భట్టి, దామోదర, కోదండరాం లాంటి వాళ్లు ఫస్ట్ డే నే అటెండ్ అయి తమ ఎజెండా చాటుకున్నారు.
పార్టీ కోసం కాకుండా.. గ్రూపుల కోసం.. పని చేయడం ఏంటి? పీసీసీ చీఫ్ను ఈ సీనియర్లంతా ఇంతలా టార్గెట్ చేయడం ఏంటి? ఇది ఎవరికి లాభం? కాంగ్రెస్కేగా నష్టం? అంటూ హస్తం కేడర్ మండిపడుతోంది.