Adani Shares Jump:హిండెన్బర్గ్ ఆరోపణలతో కుదేలైన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు… మళ్లీ పరుగులు తీస్తున్నాయి. అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో… అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్నర్స్ సంస్థ మైనారిటీ వాటాలను కొనుగోలు చేసిందనే వార్తలతో… అదానీ కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏకంగా 17 శాతం పెరగ్గా, అదానీ పోర్ట్స్ 10 శాతం, మరో నాలుగు కంపెనీలు 5 శాతం చొప్పున లాభపడ్డాయి.
రూ.15,446 కోట్లతో… సెకండరీ మార్కెట్ బ్లాక్ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల్లో వాటాలు దక్కించుకుంది… జీక్యూజీ సంస్థ. దీన్ని భారత సంతతికి చెందిన రాజీవ్ జైన్ 2016 జూన్లో స్థాపించారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జీక్యూజీ పార్ట్నర్స్… ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ. ఇది ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. వర్ధమాన దేశాల్లో వివిధ రంగాల్లో జీక్యూజీ పెట్టుబడులు పెడుతోంది. గ్లోబల్ ఈక్విటీ, ఇంటర్నేషనల్ ఈక్విటీ, ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ, యూఎస్ ఈక్విటీ వంటి ఫండ్లను నిర్వహిస్తూ… దీర్ఘకాలంలో తమ క్లయింట్లకు భారీ రాబడులు అందించింది.
తనదైన పెట్టుబడి వ్యూహాలతో జీక్యూజీని 92 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థగా నిలబెట్టారు… రాజీవ్ జైన్. భవిష్యత్లో అత్యధిక వృద్ధికి అవకాశం ఉన్న రంగం టెక్నాలజీ ఏ మాత్రం కాదని నమ్మే ఆయన… ప్రధానంగా ఇంధన రంగంపై దృష్టి సారించారు. ప్రపంచమంతా సహజ ఇంధన వనరుల నుంచి కర్బన ఉద్గార రహిత ఇంధనాల వైపు మళ్లుతున్నందున… ఆయన ఈ రంగంపైనే బుల్లిష్గా ఉన్నారు. అందుకే అదానీ గ్రూప్లో వాటాల కొనుగోలుకు జైన్ ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, సౌర, పవన విద్యుత్ వంటి శుద్ధ ఇంధన రంగంలో అదానీ గ్రూప్ ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇదే సమయంలో హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనం కావడంతో… తక్కువ ధరల వద్ద వాటాలు కొనుగోలు చేశారు… రాజీవ్ జైన్. ఆయన అదానీ గ్రూపు కంపెనీల్లో ఏకంగా రూ.15 వేల కోట్లకుపైగా కుమ్మరించడంతో… ఇన్వెస్టర్లకు కూడా ఆయా షేర్లపై నమ్మకం పెరిగి కొనుగోళ్లకు ఎగబడటంతో… అవన్నీ దూసుకెళ్లాయి.