Preethi Case: కేఎంసీ పీజీ విద్యార్థిని ఆత్మహత్య కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించడంతో నిందితుడు సైఫ్ అసలు నిజాలను కక్కేస్తున్నాడు. విచారణలో సంచలన విషయాలను వెల్లడిస్తున్నాడు. డాక్టర్ ప్రీతి ఫోన్ లో దొరికిన సమాచారంతో వివరాలను క్రోడీకరిస్తున్నారు. డాక్టర్ ప్రీతి మొబైల్ నుంచి లభ్యమైన 27 స్క్రీన్ షాట్స్, మెసేజ్ లు కీలకంగా మారాయి. డాక్టర్ ప్రీతి నుంచి ఎల్ డీడీ నాకౌట్ గ్రూపు నుంచి 3, డాక్టర్ గాయత్రీ, డాక్టర్ సంధ్యల ఫోన్ నుంచి సేకరించిన మూడు మెసేజ్ లతో కీలక సమాచారాన్ని రాబట్టారు. డాక్టర్ వైశాలి నుంచి 6, డాక్టర్ సంధ్య నుంచి 10 చాటింగ్ మెసేజెస్ లతో పాటు.. డాక్టర్ స్పందన, నిందితుడు సైఫ్ నుంచి ఒక్కో చాట్ ను అనాలసిస్ చేస్తున్నారు.
సాంకేతిక ఆధారాలను సరిపోల్చుతూ నిందితుడు డాక్టర్ సైఫ్ ను విచారిస్తున్నారు. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడు డాక్టర్ సైఫ్ ను .. విచారణాధికారి ఏసీపీ బోనాల కిషన్ ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న ఎంజీఎం హెడ్ నర్స్ ఎల్లందుల సునీత, స్టాఫ్ నర్స్ చిన్నపల్లి కళా ప్రపూర్ణ నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. విచారణలో డాక్టర్ ప్రీతి బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ కీలకంగా మారింది.
బ్యాగ్ లోని మొత్తం 24 ఆధారాలతో కేసును పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో అనుమానాస్పదంగా మారిన మజా కూల్ డ్రింక్, లేస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ను కూడా సేకరించి భద్ర పరిచారు. ఎంజీఎం సెక్యూరిటీ గార్డులు రాజబోయిన సాంబరాజు, ఎర్రోజు కిశోర్ ల నుంచి కూడా విచారణ అధికారుల బృందం వివరాలు సేకరిస్తోంది.