TS News: తెలంగాణలో రోజురోజుకి వీధి కుక్కల బెడద తీవ్రమవుతోంది. ఇటీవల వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన తరువాత వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత కుక్కల దాడికి గురైయ్యారు. బిద్రెల్లిలో ఎంపీపీ సునీత భర్త.. విశ్వనాథ్ పటేల్పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో విశ్వనాథ్ కాలుకి గాయాలయ్యాయి.
నిజామాబాద్ జిల్లా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గెస్ట్ హౌస్లో ఇద్దరి మృతి కలకలం రేపింది. నవీపేట్ మండలం జన్నేపల్లిలో ఈ ఘటన జరిగింది. గెస్ట్ హౌస్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదం జరిగి చనిపోయారు. రెండో అంతస్తులో గోడ కుల్చేస్తుండగా.. గొడతో పాటు పడిపోయి రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతన్ని చూసి గుండెపోటుకు గురై మరో వ్యక్తి కన్నుమూశాడు.
మేడ్చల్ జిల్లా కీసరలో డిగ్రీ విద్యార్థి ఆకాష్రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గీతాంజలి కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు ఆకాష్. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. యువకుడు అర్థాంతరంగా తనువు చాలించడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల పరిధిలో ఓ వ్యక్తి తల్వార్తో హల్ చల్ చేశాడు. కొండ్రికర్ర గ్రామంలో జిన్నా శంకర్ అనే వ్యక్తి తల్వార్ చేతపట్టి రౌడీయిజం ప్రదర్శించాడు. ఇదంతా పోలీసుల ఎదుటే జరిగింది. గ్రామస్తులకు, జిన్నా శంకర్ కు మధ్య ఆలయ విషయంలో కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి గొడవ విషయమై సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న శంకర్ తల్వార్ చేతపట్టి గ్రామస్తులపైకి దూసుకొచ్చాడు. పోలీసులు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి తీరులో మార్పు రాలేదు.
కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీలకు వేల కోట్లు దోచిపెడుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో బీఆరేస్ శ్రేణులు వంటావార్పు నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ పోరాటం ఆగదని చెప్పారు వినయ్భాస్కర్.