BJP: నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకుల మధ్య విభేధాలు చల్లారటం లేదు. రోజు రోజుకీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువవుతూనే ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లా బీజేపీ పార్టీలో ఒకింత జోష్ వచ్చింది. ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలవటంతో జిల్లా బీజేపీ పాలిటిక్స్ లో కాస్త ఊపు వచ్చింది. పార్టీ జిల్లాలో బలోపేతం అవుతూ వస్తున్నా… ముఖ్య నేతల మధ్య పొసగకపోవడం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
ఎంపీ అరవింద్ పార్టీలోకి రాకముందు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణదే హవా నడిచింది. జిల్లా బీజేపీలో ఆయన పెద్దన్న పాత్ర పోషించారు. అరవింద్ ఎంట్రీతో ఈ ఇద్దరు నేతల మధ్య వైరం మొదలైంది. అది కాస్తా రోజు రోజుకీ ముదురుతోందని పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వీరి మధ్య అధిపత్య పోరు చిలికిచిలికి గాలి వానగా మారుతోంది.
నిజామాబాద్ రూరల్ నాయకులతో జరిగిన మీటింగ్ లో ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎంపీ అరవింద్ వర్గానికి చెందిన ఇద్దరు నాయకులను స్టేజీ నుంచి కిందికి వెళ్లిపోవాలంటూ బస్వ లక్ష్మీనర్సయ్య చెప్పడంతో వాగ్వాదం ప్రారంభమైంది. ఈ విషయంపై అరవింద్.. బస్వతో వారించినట్లు సమాచారం. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య అధిపత్య పోరు బైటపడిందని జిల్లా బీజేపీ క్యాడర్ భావిస్తోంది.
మరోవైపు జిల్లాలో బీజేపీ పుంజుకుంటున్న సమయంలో కీలక నేతల మధ్య అధిపత్య పోరుతో క్యాడర్ గందరగోళంలో పడుతోంది. ఎందుకంటే… జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ, ఎంపీ అరవింద్ కు పొసగటం లేదన్న ప్రచారం ఒకవైపు సాగుతోంది. మరోవైపు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య కు… ఎంపీ అరవింద్ కు మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. దీంతో బస్వ లక్ష్మీనర్సయ్య… యెండలతో సఖ్యతగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. మరోవైపు అర్బన్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.. ఎంపీ అరవింద్ తో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు.
యెండల లక్ష్మీనారాయణ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా… ఎంపీ అరవింద్, ధన్ పాల్ వర్గీయులు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఎంపీ అరవింద్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే… యెండల, బస్వ వర్గీయులు దూరంగా ఉంటున్నారు. బీజేపీనే నమ్ముకున్న కార్యకర్తల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల ఎవరి వద్దకు వెళ్లాలో ఎవరి వద్దకు వెళ్లోద్దోననే సంశయం నెలకొంది. ఇప్పటికే బీజేపీ నుంచి గెలిచిన కార్పోరేటర్లు చాలా మంది బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. మరికొంత మంది కూడా వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి… ఈ నేతల ఆధిపత్య పోరు వల్ల లీడర్లు, క్యాడర్ పార్టీకి దూరమవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో….ముఖ్య నాయకులు కలిసికట్టుగా ఉండి క్యాడర్ లో జోష్ నింపాల్సింది పోయి ఇలా అధిపత్య పోరుకు పోతే జిల్లాలో పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కిందిస్థాయి నాయకులు.
రానున్నది ఎన్నికల కాలం ఇకనైనా నేతలు తమ విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు బీజేపీ కార్యకర్తలు. కనీసం అధిష్టానమైనా కలగ జేసుకుని జిల్లా బీజేపీ కీలక నేతల మధ్య సయోధ్య కుదుర్చాలంటున్నారు.