Kavitha: ఎందుకో ఏమో గానీ.. ఎమ్మెల్సీ కవిత ప్రముఖ టీవీ ఛానెల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలు మీడియా సంస్థలు అడిగినవి కాదని.. కవితనే పిలిచి మరీ అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారని తెలిసిపోతోంది. ఎందుకు? ఇంత సడెన్గా అన్నేసి ఛానెల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అనే చర్చ నడుస్తోంది.
ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ కోసం చేయబోయే ధర్నా కోసమా? అంటే.. జస్ట్ ఆ ప్రోగ్రామ్ కోసం అయితే ఇంత హడావుడి అవసరం లేదని అంటున్నారు. మరి ఎందుకోసం? అంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లారిటీ ఇచ్చేందుకేనని చెబుతున్నారు.
చాలా విషయాలే మాట్లాడారు కవిత. కానీ, వాటన్నిటిలోకి లిక్కర్ స్కామ్ అంశాలే బాగా వైరల్ అయ్యాయి. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేదే లేదని.. అందులో తన పాత్ర అస్సలు లేదని కవిత చెప్పారు. 130 కోట్ల అవినీతి గురించి తనకు తెలీదన్నారు. సీబీఐ కేసుకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఆ కేసులో కవితను అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? అని అడిగితే.. తనను అరెస్ట్ చేస్తే ప్రజాకోర్టులో తేల్చుకుంటానని కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు.
త్వరలో కవిత తీహార్ జైలుకు వెళ్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారని ఆమె దృష్టికి తీసుకెళితే.. ఏజెన్సీ సంస్థలు ఏం చేయాలో బీజేపీ నేతలే చెబుతారా? అని కవిత మండిపడ్డారు. బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తానన్నారు.
సీబీఐ ఛార్జిషీట్లో కవిత 10 ఐ ఫోన్లు ధ్వంసం చేశారని ఉందిగా? అని ప్రశ్నిస్తే.. తాను ఎలాంటి ఫోన్లు ధ్వంసం చేయలేదని.. సీబీఐ అడిగితే వారికి తన ఫోన్ ఇస్తానని అన్నారు. ఈ కేసులో కేసీఆర్ నుంచి తనకు న్యాయ సలహాలు అందుతున్నాయని చెప్పారు. బీజేపీకి అసలు టార్గెట్ తాను కాదని.. కేసీఆరేనని కవిత అన్నారు.
ఇలా పలు ఛానెల్స్లో ప్రసారమైన కవిత ఇంటర్వ్యూ క్లిప్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. కవిత మాటలు చూస్తుంటే.. జైలుకు వెళ్లేందుకు మానసికంగా సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.