Rahul Gandhi: జమ్మూకశ్మీర్లో భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు తనను చంపేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానన్న ఒకే ఒక్క కారణంతో తనను వాళ్లు ఏం చేయలేదని తెలిపారు. లండన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే టాపిక్పై మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘జమ్ముకశ్మీర్లోకి ఎంటర్ అవ్వగానే ఉగ్రవాదుల ముప్పు ఉందని, యాత్రను విరమించుకోవాలని భద్రతా సిబ్బంది నాకు చెప్పారు. అయినా కూడా నేను ముందుకే సాగాలని నిర్ణయించుకున్నా. అలా యాత్ర సాగుతున్న సమయంలో ఓ వ్యక్తి నాతో మాట్లాడేందుకు వచ్చాడు. నిజంగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చారా? అని ప్రశ్నించాడు. కాసేపటికి దగ్గర్లో ఉన్న కొంత మందిని చూపిస్తూ.. వారు ఉగ్రవాదులు అని చెప్పి వెళ్లిపోయాడు.
వెంటనే నేను షాక్ అయ్యాను. సమస్యల్లో ఉన్నానేమో అనిపించింది. వాళ్లు నన్ను చంపేసేవారే.. కానీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్న ఒకే ఒక్క కారణంతో నాపై దాడి చేయలేదు. అది లిజనింగ్కు ఉన్న శక్తి’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.