Messi: గతేడాది డిసెంబర్లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఫ్రాన్స్పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలుపొందింది. ఈ విజయం సాధించి మూడు నెలలు అవుతున్నా జట్టు సభ్యులు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక టీమ్ కెప్టెన్ మెస్సి జట్టు సభ్యులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఫిఫాలో విజయం సాధించినందుకు గుర్తుగా తమ జట్టులోని సభ్యులకు, సిబ్బందికి మరిచిపోలేని బహుమతి అందజేశాడు. మొత్తం 35 మందికి బంగారు ఐఫోన్లను ఇచ్చాడు. 24 క్యారెట్ల బంగారంతో రూ.1.72 కోట్లు పెట్టి ఆ ఫోన్లను ప్రత్యేకంగా తయారు చేయించాడు.
ఐడిజైన్ అనే గోల్డ్ సంస్థ ద్వారా ఈ ఫోన్లను తయారు చేయించాడు. ప్రతి ఫోన్ వెనుక భాగంలో అర్జెంటీనా లోగో, క్రీడాకారుడి పేరు, జెర్సీ నంబర్, వరల్డ్ కప్ ఛాంపియన్స్2022 అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ప్రస్తుతం ఈ ఫోన్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.