Governor : తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య మరో వివాదం ముదిరింది. ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడంతో ఈ అంశంపై వార్ మొదలైంది. దీంతో కేసీఆర్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బిల్లుల ఆమోదం కోసం ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. సీఎస్ శాంతికుమారి తీరుపై మండిపడ్డారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరలోనే ఉందని సెటైర్లు వేశారు. సీఎస్ శాంతికుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కనీస మర్యాదగా వచ్చి తనను కలవలేదన్నారు. కనీసం ఫోన్ కూడా చేయలేదని తెలిపారు.పెండింగ్ బిల్లుల సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని స్పష్టంచేశారు. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయటమేంటని ప్రశ్నించారు. తన వద్దకు ఎందుకు రాలేదని సీఎస్ ను ప్రశ్నించారు. బిల్లులు పెండింగ్ లో ఎందుకున్నాయో తెలుసుకోవడానికి కనీసం ఒక్కసారిగా వచ్చి కలవలేదన్నారు. సీఎస్ శాంతికుమారి వచ్చి తనతో మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.
గవర్నర్, ప్రభుత్వానికి మధ్య రేగిన పెండింగ్ బిల్లుల వివాదానికి గవర్నర్ పరిష్కారం చెప్పేశారు. తనతో చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తేల్చారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ ను సంప్రదించలేదు? నేరుగా సుప్రీంకోర్టుకే ఎందుకు వెళ్లాల్సివచ్చింది? మరి తాజాగా గవర్నర్ ఇచ్చిన సూచనతోనైనా తెలంగాణ ప్రభుత్వం వెనక్కితుగ్గుతుందా? తమిళిసైను కలిసి పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించుకుంటుందా? లేకపోతే సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటుందా?
గత అసెంబ్లీ సమావేశాలకు బడ్జెట్ పై వివాదం రేగింది. తమిళిసై బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే చివరకు కోర్టులో భంగపాటు ఎదురుకావడంతో పిటిషన్ ను ఉపసంహరించుకుని.. చివరకు గవర్నర్ కలుసుని సమస్యను పరిష్కరించుకుంది. అసెంబ్లీ సెషన్ లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అటు గవర్నర్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇప్పుడే అదే పరిస్థితి సీన్ రిపీట్ అవుతుందా?