IND Vs AUS : ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు రెండో బంతికే రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పంపాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 నాటౌట్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) భారత్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో మ్యాచ్ ను ఆసీస్ 18.5 ఓవర్లలోనే ముగించింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మ్యాచ్ మొత్తంమీద 11 వికెట్లు తీసిన నాథన్ లయన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 197 పరుగులు సాధించింది. దీంతో ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 88 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక్కడే ఆసీస్ మ్యాచ్ పై పట్టు సాధించింది.
రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ బ్యాటర్లు తేలిపోయారు. పుజారా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దీంతో టీమిండియా 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో కునెమన్ 5 వికెట్లు పడగొట్టిన టీమిండియా వెన్ను విరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో లైయన్ 8 వికెట్లు తీసి భారత్ ను కుప్పకూల్చాడు. మొత్తం ఈ మ్యాచ్ లో ఆసీస్ స్పిన్నర్లు 18 వికెట్లు తీశారు.
తొలి రెండు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు మూడు టెస్టులో ఆసీస్ గెలవడంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 9న ప్రారంభంకానుంది.