Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ అందరిలా రొటీన్ రాజకీయ నాయకుడు కాదు. ప్యూర్ పాలిటిక్స్ చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై ఒంటికాలి మీద లేచి మండిపడే పవన్.. ఏపీ అభివృద్ధి విషయంలో సపోర్ట్గా నిలిచారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ మేరకు ట్విటర్లో శుభాకాంక్షలు చెప్పారు. పనిలో పనిగా రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు అంటూ జగన్ సర్కారుపై సెటైర్లూ వేశారు. ఈ రెండు రోజులూ ఎలాంటి రాజకీయ విమర్శలు చేయమంటూ గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఇంతకీ పవన్ కల్యాణ్ ఏమన్నారంటే….
“దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతో పాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను.
వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం.. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి.
రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి!
ఈ సమ్మిట్ ఆలోచనలను కేవలం వైజాగ్కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్ లాగా మార్చండి.
ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న” అంటూ వరుస ట్వీట్లు చేశారు పవన్ కల్యాణ్.