Kondagattu: కార్తి హీరోగా చేసిన ఖాకీ మూవీ ఖతర్నాక్ ఉంటుంది. పోలీస్ మార్క్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో చూపించింది. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఎందాకైనా వెళతారనే విషయం గుర్తు చేస్తుంది. సినిమాలో దోపిడీ దొంగల ముఠా.. లూటీలు చేసి.. రాష్ట్రాలు దాటేస్తుంది. ఆ దొంగలంతా ఒకే ఊరు వాళ్లు, బంధువులు. వేలిముద్రల ఆధారంగా వాళ్లు ఎక్కడివారో తెలుసుకుని.. ఆ స్టేట్కి వెళ్లి మరీ వారిని పట్టుకుంటారు పోలీసులు. ఇదీ సింపుల్గా ‘ఖాకీ’ సినిమా స్టోరీ.
సేమ్ టు సేమ్.. ఖాకీ మూవీ తరహాలోనే కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకున్నారు జగిత్యాల పోలీసులు. మొత్తం ఏడుగురు దొంగలు. అంతా బంధువులే. అందులో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. కర్నాటకలోని బీదర్ నుంచి బైక్లపై కొండగట్టుకు వచ్చి.. పక్కాగా రెక్కీ చేసి.. స్వామి వారి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఆలయ పర్యటనకు వచ్చి వెళ్లాక కొద్ది రోజులకే ఈ దొంగతనం జరగడంతో.. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు.
దొంగల ముఠా బీదర్ నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకున్నారు. భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకున్నారు. మరుసటిరోజు (ఫిబ్రవరి 23) మరోసారి స్వామివారి దర్శణం చేసుకున్నారు. పరిసరాలపై రెక్కీ నిర్వహించారు. అర్ధరాత్రి దాటాక.. ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి గుళ్లోకి ప్రవేశించారు. స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, రెండు శఠగోపాలు, వెండి గొడుగు, రామరక్ష, ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించారు. సుమారు 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురయ్యాయి. ఎందుకోగానీ, బంగారు ఆభరణాలు మాత్రం ఎత్తుకెళ్లలేదు.
దొంగలను పట్టుకునేందుకు 10 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కేసులో పోలీస్ డాగ్ కీ రోల్ ప్లే చేసింది. దొంగలు ఆలయంలో చోరీ చేసిన తరువాత.. గుడి వెనకవైపునకు వెళ్లి మద్యం సేవించారు. పోలీస్ డాగ్.. ఆలయం వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వాసన పసిగట్టింది. పోలీసులు ఆ బీరు సీసాలపై ఉన్న వెలిముద్రలు సేకరించారు. వాటి ఆధారంగా దొంగలెవరో తేలిపోయింది. వారంతా బీదర్కు చెందిన దొంగల ముఠాగా గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలు బీదర్ వెళ్లి ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. అయితే, మరో నలుగురు దొంగలు మాత్రం దొరకలేదు. వారికోసం కర్నాటకలో విస్తృతంగా గాలిస్తున్నారు. దొంగతనం చేసిన వెండి ఆభరణాలను రికవరీ చేశారు జగిత్యాల పోలీసులు.
ఆ ఏడుగురు దొంగలూ రక్త సంబంధీకులేనని తేలింది. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. వారంతా కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన వారు. ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేస్తుంటారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణలోని చాముండేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు. కొండగట్టు అంజన్న ఆలయంలోనూ చోరీ చేసి.. జగిత్యాల పోలీసులకు దొరికిపోయారు. దొంగలెవరో 24 గంటల్లోనే గుర్తించినా.. బీదర్ వెళ్లి వారిని పట్టుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఈ పోలీస్ ఆపరేషన్లో పాల్గొన్న 27 మంది సిబ్బందికి.. ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నారు. తెలంగాణ పోలీసులా.. మజాకా.