ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించడం చాలా కష్టం. వాతావరణ మార్పులను బట్టి ఏదో ప్రమాదం జరగనుందని శాస్త్రవేత్తలు గుర్తించే అవకాశం ఉన్నా కూడా.. ఆ విషయంపై ప్రజలను హెచ్చరించే సమయం వారికి ఉండదు. ముఖ్యంగా భూకంపాల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ టెక్నాలజీ సాయంతో ఎలాగైనా భూకంపాలను ముందే గుర్తించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఆ కోణంలో ప్రస్తుతం పరిశోధనలు కూడా చేపట్టారు.
భూకంపాలను ముందే కనిపెట్టే విషయంలో నాసా.. కొందరు శాస్త్రవేత్తలకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ విషయంపై పరిశోధనలు చేయాలనుకున్న శాస్త్రవేత్తలు.. ఒక టీమ్లాగా ఏర్పడి పలు శాటిలైట్ల నుండి జపాన్, యూరోప్ స్పేస్ ఏజెన్సీలకు వచ్చే చిత్రాలను సేకరించారు. వాటిని వారి పరిశోధనల కోసం ఉపయోగించనున్నారు. ఆ ఫోటోలను బట్టి పలు ప్రాంతాల్లో భవిష్యత్తులో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా లేదా కనుక్కోనున్నారు. ఇలా భూకంపాలు కనుక్కోవడం కుదురుతుందా లేదా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం ఈ ప్రక్రియను ధృడంగా నమ్ముతున్నారు.
గ్రౌండ్ డిఫార్మేషన్ను శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కడ నుండి అయినా ఈ పనిచేసే అవకాశం ఉంటుందని వారు అన్నారు. మామూలుగా భూకంపం గురించి కనుక్కోవడానికి ఎన్నో ప్రమాదకరమైన ప్రాంతాలకు ప్రయాణించవలసి ఉంటుంది, కానీ ఈ ప్రక్రియలో అలాంటి అవసరం ఏమీ లేదన్నారు. 2022లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. పూర్తిగా మూడేళ్లు కేటాయించాల్సిన ఈ ప్రాజెక్ట్లో ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్నారు.
ఈ మూడేళ్ల ప్రాజెక్ట్ కోసం నాసా పూర్తిగా 5 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని శాస్త్రవేత్తల టీమ్కు అందించనుంది. ఇంతకు ముందు నాసా చేసిన ఆర్థిక సాయంతో హైతీలో భూకంప తీవ్రతను కనుక్కున్నామని వారు తెలిపారు. 2021లో హైతీలో 7.2 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం ఏర్పడింది. కానీ అప్పటివరకు వారు చేసిన అప్రోచ్ తప్పని.. హైతీ భూకంపం తర్వాత తేలిందని వారు బయటపెట్టారు. మామూలుగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కదలికలు ఉంటాయని, ఇప్పుడు అనేక కంప్యూటింగ్ మోడల్స్ ద్వారా ఈ కదలికలు దేనికి దారితీస్తాయని కనుక్కునే అవకాశం ఏర్పడిందని వారు తెలిపారు.
శాటిలైట్ల ద్వారా వారు అందుకున్న ఇమేజ్లను బట్టి నేల ఒక్క ఇంచు కదిలినా శాస్త్రవేత్తలకు తెలిసిపోతుంది. శాటిలైట్ల నుండి అందే రాడార్ సిగ్నల్స్ ఈ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నేలపై జరుగుతున్న మార్పులను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎక్కడో అంతరిక్షంలో ఉండే శాటిలైట్.. భూమిలోపల జరిగే మార్పులను గుర్తించగలదు అన్న ఆలోచన చాలా వింతంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తుచేసుకున్నారు. వారు చేసిన ఈ పరిశోధన.. హైతీ, డొమెయిన్ రిపబ్లిక్ ప్రాంతాల్లో భూకంపం ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని మాత్రమే కాకుండా ఎంత తీవ్రతతో వస్తుంది అని విషయాన్ని కూడా ముందే గుర్తించగలదు.