స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి దాదాపు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. అంతే కాకుండా స్పేస్ విషయంలో ఎవరు, ఎప్పుడు కొత్త విషయాన్ని కనిపెడతారా అని ప్రపంచ దేశాల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రభుత్వాలు ఎక్కువగా ఆలోచించడం లేదు. తాజాగా యూకే కూడా అలా ఆలోచించి స్పేస్ ఏజెన్సీకి భారీ పెట్టుబడిని అందజేసింది.
స్పేస్ టెక్ విభాగంలో పనిచేస్తున్న కంపెనీలకు యూకే స్పేస్ ఏజెన్సీ 51 మిలియన్ పౌండ్లను పెట్టుబడిగా అందజేసింది. ఇది స్పేస్ టెక్నాలజీ విభాగంలో చంద్రుడిపై చేసే పరిశోధనలకు కొత్త ఊపునివ్వనుంది. 2028 నుండి ల్యూనార్ ఆర్బిట్లో శాటిలైట్లతో కలిపి ఒక కూటమి ఏర్పాటు చేయాలని అక్కడి సంస్థలు టార్గెట్గా పెట్టుకున్నాయి. ఇతర దేశాలు కూడా ఈ విషయంలో యూకేకు సపోర్ట్ చేయనున్నాయి.
స్పేస్, శాటిలైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి ప్రస్తుతం సైన్స్ సూపర్ పవర్ను ప్రపంచాన్ని అందజేసేవాటిలో ముందంజలో ఉన్నాయి. అందుకే 10 ఏళ్లలోపు ఈ విభాగంలో ఎనలేని కీర్తిని సంపాదించాలని యూకే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే 16.5 బిలియన్ పౌండ్లను ఈ విభాగంలో పరిశోధనల కోసం వెచ్చించింది. చంద్రుడిపై జరగనున్న పరిశోధనలను యూకే, ఇటలీ కలిసి చేయనున్నాయి. ట్యూనార్ డేటాను హై టెక్నాలజీతో సేకరించడమే ఈ పరిశోధనల ముఖ్య లక్ష్యం.
యూకే చేయనున్న ఈ పరిశోధనలకు మూన్లైట్ ప్రోగ్రామ్ అని పేరు కూడా పెట్టారు. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ప్రస్తుతం యూకేలోని స్పేస్, శాటిలైట్ ఇండస్ట్రీలో 47 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ పరిశోధనలను సక్సెస్ చేసి కమర్షియల్గా ఎదగాలని యూకే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కమర్షియల్గా సక్సెస్ అయితే ఈ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది.
ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి గేట్వే అనే లూనార్ స్పేస్ స్టేషన్ను డెవలప్ చేస్తున్నారు. ఇది చంద్రుడిపై పరిశోధనలు చేయాలనుకునే ఆస్ట్రానాట్స్కు సాయంగా నిలబడనుంది. ఈ పరిశోధన తమకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆస్ట్రానాట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో చంద్రుడిపై ఎక్కువకాలం గడిపేలా ఈ పరిశోధనలు తోడ్పతాయని వారు అన్నారు. అందుకే ఇలాంటి వాటిలో భాగమవ్వడానికి ప్రైవేట్ సంస్థలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నాయి.