Gandra : తెలంగాణలో కొంతకాలంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎక్కువగా వార్ నడుస్తోంది. ఇరుపార్టీల నేతలు సవాల్, ప్రతిసవాల్ చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేవారు. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అగ్గి రాజుకుంటోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హథ్సే హాథ్ జోడో పాదయాత్రతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీకి ఊపు వస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి సభపై ఎటాక్ జరిగింది. కుట్రతోనే బీఆర్ఎస్ నేతలు తమ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కార్యకర్తలను పంపడం కాదు ..దమ్ముంటే ఎమ్మెల్యే రావాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూ అక్రమాలు, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ విమర్శలపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. రేవంత్రెడ్డి తన మాటతీరు మార్చుకోవాలన్నారు. లేదంటే సహించేది లేదని స్పష్టంచేశారు. తనపై చేసిన ఆరోపణలను ఖండించారు.ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు వస్తానన్నారు. కాంగ్రెస్ నేతలు సిద్ధమా? అని గండ్ర సవాల్ విసిరారు. గురువారం ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేడ్కర్ సెంటర్కు తాము వస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఆధారాలతో రావాలని సవాల్ చేశారు.
మరి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ ను కాంగ్రెస్ నేతలు స్వీకరిస్తారా? ఆయన చెప్పిన ప్లేస్ కు వస్తారా? ఒకవేళ కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగ చర్చకు సిద్ధమైతే భూపాలపల్లిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిపై దాడికి ప్రయత్నం చేసిన తర్వాత భూపాలపల్లి నివురుగప్పిన నిప్పులా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గురువారం భూపాలపల్లిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.