RRR సినిమా వైపు యావత్ భారత దేశం ఆశగా ఎదురు చూస్తోంది. మార్చి 12న లాస్ ఏంజిల్స్లో జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎంపికైన నాటు నాటు పాట విజేతగా నిలవాలని దేశం కోరుకుంటోంది. ఈ క్రమంలో ఈ నాటు నాటు పాటకు మరో అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను లైవ్ పెర్ఫామెన్స్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. హాలీవుడ్ చిత్రాలతో పాటు ఇప్పుడు నాటు నాటు పాటకు ఈ గౌరవం దక్కటంపై అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే RRR చిత్రం పాలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ ఫైనల్ లిస్టులోనే నామినేట్ అయ్యింది. ఈ పాటను చరణ్, ఎన్టీఆర్లపై ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో చిత్రీకరించారు. 7 రోజుల పాటు రిహార్సల్ చేశారు. 17 రోజుల పాటు పాటను చిత్రీకరించారు. మొత్తం 300 డాన్సర్స్ ఈ పాటలో పాల్గొన్నారు.
గత ఏడాది మార్చి 24న విడుదలైన RRR చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్స్ను రాబట్టుకుంది. ఇందులో ఆలియాభట్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి వంటి హాలీవుడ్ నటులు కూడా ఇందులో నటించారు.