BRS : టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయస్థాయిలో కారు స్పీడ్ పెంచాలని కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, నాదేండ్ లో బహిరంగ సభలు పెట్టి పార్టీ లక్ష్యాలను , అజెండాను ప్రకటించారు. అటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్రలో ఇప్పటికే కొందరు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇలా కేసీఆర్ పార్టీ విస్తరణ చేపట్టి దూకుడుగా ముందుకెళుతుంటే కారు స్పీడ్ కు కేంద్రం బ్రేకులు వేస్తోంది. పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. గులాబీ పార్టీకి బీఏసీలో సభ్యత్వాన్ని లోక్ సభ సచివాలయం తొలగించింది.
కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడానికి ఆమోదం తెలిపింది. కానీ బీఆర్ఎస్ కు లోక్సభ సచివాలయం గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు. తాజా సమావేశానికి ఆయనకు ఆహ్వానితుడిగానే లోక్సభ సచివాలయం నుంచి పిలుపు వచ్చింది. ఇక నుంచి బీఆర్ఎస్ కు ఆహ్వానం పంపితేనా బీఏసీ భేటీకి హాజరుకావాలి.
లోక్ సభలో ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీకి బీఏసీలో సభ్యత్వం ఉంటుంది. బీఆర్ఎస్ కు లోక్సభలో 9 మంది సభ్యులున్నారు. అయినా సరే లోక్సభ సచివాలయం బీఆర్ఎస్ ను బీఏసీ సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించింది ? ఆహ్వానిత పార్టీగా ఎందుకు మార్చేసింది? ఈ ప్రశ్నలపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలు ఎన్నిరోజులు జరగాలి, సమావేశాల అజెండా లాంటి కీలక అంశాలపై బీఏసీలోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు లోక్ సభ సచివాలయం ఇచ్చిన షాక్ తో బీఆర్ఎస్ కు ఆహ్వానం అందితేనే సమావేశానికి వెళ్లాలి. ఆహ్వానం రాకపోతే బీఏసీలో అభిప్రాయం చెప్పే అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోతుంది.
మరోవైపు పార్లమెంట్ వేదికగా గళమెత్తాలని పార్టీ ఎంపీలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులపైనా, జాతీయ సమస్యలపైనా పార్లమెంట్ లోపల, బయట కూడా కేంద్రంపై పోరాడాలని ఎంపీలతో జరిగిన సమావేశంలో చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగానే బీఆర్ఎస్ ను అవమానపర్చేలా లోక్ సభ సచివాలయం నిర్ణయం తీసుకోవడంతో .. బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తారా? మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తారా? కేంద్రం ఇచ్చిన షాక్ కు .. బీఆర్ఎస్ ఇచ్చే కౌంటర్ ఏంటి?