IND Vs AUS : ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆస్ట్రేలియా స్పిన్నర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. టీమిండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. చెరో మూడో ఫోర్లు బాది ఊపుమీదున్న కెప్టెన్ రోహిత్ (12) శుభ్ మన్ గిల్ (21) ను వెంటవెంటనే అవుట్ చేసి ఆసీస్ కు కుహ్నెమన్ శుభారంభం అందించాడు. ఆ తర్వాత పుజారా ఒక్క పరుగే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జడేజా ( 4), శ్రేయస్ అయ్యర్ ( డకౌట్) అవుట్ కావడంతో 45 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో విరాట్ కోహ్లీ , కీపర్ శ్రీకర్ భరత్ క్రీజులో నిలబడి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే జట్టు స్కోర్ 70 పరుగుల వద్ద కోహ్లీ (22) పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత భరత్ (17) వెనుదిరగడంతో లంచ్ విరామ సమాయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
లంచ్ బ్రేక్ తర్వాత అశ్విన్ (3) అవుట్ కావడంతో టీమిండియా 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్ వంద దాటడం అనుమానంగా ఉన్న సమయంలో ఉమేష్ యాదవ్ (17) కాసేపు మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ స్కోర్ వంద పరుగులు దాటింది. చివరికి 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిరాజ్(0) రనౌట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అక్షర్ పటేల్ 12 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 33. 2 ఓవర్లలోనే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
కెరీర్ లో రెండో టెస్టు ఆడుతున్న మథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీయగా.. లయన్ కు 3, మర్ఫీ కి ఒక వికెట్ దక్కాయి. 9 వికెట్లు స్పిన్నర్లు దక్కడం విశేషం.