SabithaindraReddy : హైదరాబాద్ నార్సింగ్ లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. విద్యార్థి ఆత్మహత్యపై విచారణకు ఆదేశించారు. అలాగే ఘటనపై విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను కూడా సబిత ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్తోపాటు మేనేజ్మెంట్పై సెక్షన్ 305 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు అన్నారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతి చెందాడని ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడటం అందర్నీ కలచివేసింది.
శ్రీచైతన్య కాలేజ్ వద్ద విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గతంలో తమపై కాలేజీ సిబ్బంది దాడి చేశారంటూ కొన్ని దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం సెలువులు ప్రకటించింది. విద్యార్థులను హాస్టల్ నుంచి ఇళ్లకు పంపేసింది.