Student Suicide : తెలంగాణలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ నార్సింగ్ లోని శ్రీచైతన్య కాలేజ్ లో ఈ ఘటన జరిగింది. ఈ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో ఉరేసుకున్నాడు.
శ్రీ చైతన్య కాలేజీలో మంగళవారం రాత్రి క్లాస్రూమ్లోనే సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కాలేజీ సిబ్బందిని సాయం కోరినా సహకరించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారని మండిపడుతున్నారు. బయటకు తీసుకొచ్చి వాహనం లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తరలించామంటున్నారు. కానీ ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్ట్ కోసం విద్యార్థి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సాత్విక్ మృతిపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో లెక్చరర్ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడంటున్నారు. సాత్విక్ను ఏం అనొద్దని గతంలోనే చెప్పామని అంటున్నారు. మానసిక ఒత్తిడికి గురిచేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమంటున్నారు.
మరోవైపు నార్సింగ్ శ్రీచైతన్య కళాశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సాత్విక్ తల్లిదండ్రుల రోడ్డుపై బైఠాయించి ఆందోళ చేపట్టారు. విద్యార్థి సంఘాలు నిరసన చేస్తున్నాయి.