RevanthReddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేస్తున్న రేవంత్.. భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ వద్ద కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్, మోదీ కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ , విద్యుత్ శాఖ కార్మికులు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.
సకల జనుల సమ్మెకు కార్మికులు నడుం బిగించాకే తెలంగాణ ఏర్పడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసీ కార్మిక సంఘానికి హరీష్రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని.. కార్మిక సంఘాలపై కూడా వారి కుటుంబమే గుత్తాధిపత్యం చేస్తోందని విమర్శించారు. బొగ్గు గని కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. వేలాది కోట్లు కొల్లగట్టడానికే తప్ప… కార్మికుల సమస్యలు తీర్చడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదని ఆరోపించారు.
ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలల్లా కలిసి ఉన్నాయని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మోదీ నిర్ణయాలకు గతంలలో కేసీఆర్ సహకరించారని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేకత భయంతోనే ఇప్పుడు బీజేపీతో కేసీఆర్ విభేదిస్తున్నట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. తాడిచర్ల మైన్లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? అని ప్రశ్నించారు. ప్రతిమా శ్రీనివాస్కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? శ్రీధర్ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్కు ఉన్న ప్రయోజనాలేంటి అని ప్రశ్నల వర్షం కురింపించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన కార్మికులు ఇప్పుడు తెలంగాణను కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి చారిత్రక అవసరం ఉందన్నారు.