Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసింది. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేసి సంచలనం సృష్టించింది.
కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నారు.
సీబీఐ అరెస్టు చేయడంపై మనీష్ సిసోడియా న్యాయపోరాటం చేస్తున్నారు. తన అరెస్ట్ ను, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తున్న తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సిసోడియా కస్టడీపై ఢిల్లీ కోర్టు కొన్ని షరతులు విధించింది. ఐదురోజుల కస్టడీలో సిసోడియాను విచారించే చోట సీసీటీవీ ఉండాలని స్పష్టం చేసింది. ఆ ఫుటేజ్ను సీబీఐ భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. సిసోడియాకు 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఒక అరగంటపాటు తన తరఫు న్యాయవాదులను కలుసుకునే అవకాశం కల్పించాలని సూచించింది. వారిమధ్య జరిగే సంభాషణను దర్యాప్తు సంస్థ అధికారులు వినకూడదని స్పష్టం చేసింది. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు ఆయన సతీమణితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైద్యులు సూచించిన మందులు వేసుకునేందుకు సిసోడియాకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది.