KCR: ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలుగుతుంది. రాజకీయాల్లో బటర్ ఫ్లై ఎఫెక్ట్ బాగా వర్కవుట్ అవుతుంది. పొలిటికల్గా జరిగే ప్రతీ పనిలో.. వినిపించే ప్రతీ మాటలో.. ఓ హిడెన్ రాజకీయం తప్పక ఉంటుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ విషయంలోనూ అలాంటి పాలి-ట్రిక్స్ నడుస్తోందా?
ఉన్నట్టుండి సిసోడియాను అరెస్ట్ చేసింది సీబీఐ. లిక్కర్ స్కాం విచారణకు ఆయన సహకరించనందుకే అరెస్ట్ చేసినట్టు సీబీఐ చెబుతోంది. ఛార్జిషీట్లోనూ సిసోడియా పేరును నిందితుడిగా చేర్చలేదు. అయినా, అరెస్ట్ జరిగిపోయింది. ఎందుకు? అంటే, ఓ లాజిక్ చెప్పారు సీఎం కేసీఆర్.
నెల రోజులుగా దేశవ్యాప్తంగా అదానీ ఇష్యూ హల్చల్ చేస్తోంది. ప్రపంచ వీధుల్లో ఇండియా పరువంతా పోయింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. అదానీ షేర్లు అత్యంత దారుణంగా పతనమయ్యాయి. అదానీ కంపెనీలన్నీ లోన్లు, గోల్మాల్ లెక్కలతో నడుస్తున్నాయనేది హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రధాన ఆరోపణ. అదానీ గ్రూప్ అరాచకాలకు ప్రధాని మోదీనే కారణమంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి. పార్లమెంట్ జరిగినన్ని రోజులూ సభలో అదానీపై చర్చకు పట్టుబట్టాయి. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గంటన్నర ప్రసంగించిన ప్రధాని మోదీ.. అదానీ పేరెత్తకుండానే ముగించేశారు. పార్లమెంట్ బయటా అదానీ-మోదీ వ్యవహారం రగులుతూనే ఉంది. అదానీ విషయంలో మోదీనే దోషి అనే ప్రచారం జరుగుతోంది.
ఇలా ఇంటా బయటా బ్లేమ్ అవుతుండటంతో.. అదానీ-మోదీ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో అంతంత మాత్రంగా ఉండే కేసీఆర్.. సిసోడియా అరెస్ట్పై ఇలా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ ట్వీట్పై కమలనాథులు అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. సిసోడియా అరెస్ట్ను ఖండిస్తున్నారా? లేదంటే, నెక్ట్స్ కవితనే అరెస్ట్ చేస్తారని భావించి భయపడుతున్నారా? అంటూ పంచ్లు వేస్తున్నారు.