BJP: ఏదో జరుగుతోంది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ మరింత పెరిగింది. జేపీ నడ్డానో, బీఎల్ సంతోషో కాదు.. ఈసారి నేరుగా హోంమంత్రి అమిత్షా నే ఛార్జ్ తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా హస్తినకు రావల్సిందిగా షా ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో మీటింగ్ ఉంటుంది. బడా నేతలంతా హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. అమిత్ షాతో మీటింగ్ ఎజెండాపై ఆసక్తి నెలకొంది.
ఏమై ఉంటుంది? అమిత్ షా ఎందుకు పిలిపించి ఉంటారు? ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్తో తెలంగాణ బీజేపీ ఫుల్ జోష్ మీదుంది. కేసీఆర్-బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. అంతా సవ్యంగా సాగుతుండగా.. నేతలను మరింత ఉత్సాహ పరిచేందుకే అమిత్ షా రమ్మన్నారా? లేదంటే, కేసీఆర్ ముందస్తుకు వెళతారనే సమాచారం ఏదైనా కేంద్ర హోంమంత్రిని చేరిందా?
మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. నిరసనగా ఆప్ శ్రేణులు బీజేపీ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఇదే కేసులో తర్వలోనే ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. బీఆర్ఎస్ వర్గాల నుంచి వచ్చే రియాక్షన్ను బీజేపీ ఎలా కౌంటర్ చేయాలనే అంశంపై అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశ్యం చేయనున్నారా? హోంమంత్రి కాబట్టి ఆ కేసుకు సంబంధించిన విషయంపైనే అర్జెంట్ మీటింగ్ పెట్టారా? ఇలా కమలనాథుల్లో రకరకాల చర్చ నడుస్తోంది. ఏదో పార్టీ పని మీదైతే.. ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా నేరుగా జోక్యం చేసుకునేంత పెద్ద విషయాలేవీ లేవని.. ఇది పక్కా అందుకోసమేనని అంటున్నారు.