Student Suicide : తెలంగాణలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ లో ఈ విషాదరకర ఘటన జరిగింది. రక్షిత అనే బీటెక్ విద్యార్థి ఉరేసుకుని చనిపోయింది. ఓ యువకుడి వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన పబ్బోజు శంకర్ , రమాదేవి దంపతుల కుమార్తె రక్షిత నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో ఏడాది చదువుతోంది. అక్కడే హాస్టల్ లో ఉంటోంది. పదో తరగతి చదివేటప్పుడు ఆమెకు పరిచమైన రాహుల్ అనే యువకుడు ఈ మధ్యకాలంలో ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. ఈ విషయాన్ని రక్షిత కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. వారు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకుడిని స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాహుల్ నుంచి రక్షితకు వేధింపులు ఆగలేదు. శివరాత్రి రోజు రక్షిత కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. కానీ ఆమె కళాశాలకు వెళ్లలేదు. దీంతో తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత ఆమె తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత వరంగల్ లోని రామన్నపేటలోని తన సోదరుడి ఇంటికి తండ్రి శంకర్ ఆమెను పంపించారు. మిస్సింగ్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి సమయంలో రక్షిత తన బాబాయ్ ఇంట్లోనే ఉరేసుకుంది.