Preethi : కుటుంబ సభ్యులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య మెడికో ప్రీతి అంత్యక్రియులు పూర్తయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రీతి అంతిమయాత్రకు జనం భారీ తరలివచ్చారు.
హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మెడికో ప్రీతి కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్ట్ చేసి అనంతరం ప్రీతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ తర్వాత స్వగ్రామం గిర్ని తండాకు తరలించారు. ప్రీతికి కడసారి వీడ్కోలు పలికేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. మృతదేహాన్ని ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.
ప్రీతి తండ్రి నరేంద్ర తమ కుమార్తెను హత్యే చేశారంటూ విలపించారు. ప్రీతి మృతదేహాన్ని బలవంతంగా గిర్ని తండాకు తరలించారని ఆరోపించారు. హైదరాబాద్ బోడుప్పల్లోని తమ ఇంటికి తీసుకెళ్లనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను వేధించిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాము ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ వోడీలను సస్పెండ్ చేయాలని కోరారు.
ప్రీతి మృతికి సైఫ్ తోపాటు మరికొందరి ప్రేమయం ఉందని ఆమె సోదరి ఆరోపించారు. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని స్పష్టం చేశారు. ఎవరో మత్తు ఇంజక్షన్ చేశారని అనుమానం వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విధుల్లో ఉన్న సమయంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేశారు. అదే రోజు మధ్యాహ్నం వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో 5రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమెను వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించడంతోనే ప్రీతి తండ్రి నరేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోలేదని చంపేశారని ఆరోపిస్తున్నారు.