Preethi Suicide : కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య వ్యవహారం వివాదంగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించేది. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెను వేధించాడని ప్రధాన ఆరోపణ. దీంతో ప్రీతి తండ్రి నరేంద్ర మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్థీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో ఫిబ్రవరి 21న ప్రీతికి, సైఫ్కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆ రోజు ఏం జరిగింది?
ఫిబ్రవరి 21న ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 22 న తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గుర్తించారు. గుండెపోటుకు గురైందని భావించి సీపీఆర్తో గుండె పనిచేసేలా చేశారు. అనంతరం అదే ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఫిబ్రవరి 22న మధ్యాహ్నం ప్రీతిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వైద్యులు భావించారు. ప్రీతి అపస్మారక స్థితిలో పడిఉన్న గదిలో సక్సినైల్కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. అలాగే ప్రీతి గూగుల్లో సక్సినైల్కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు విచారణలో గుర్తించారు. అసలు ప్రీతి ఏ ఇంజెక్షన్ తీసుకుందో తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఇప్పుడు ఆ రిపోర్టే కీలకంగా మారనుంది.
5రోజులపాటు మృత్యువుతో పోరాటం..
వైద్యుల కథనం ప్రకారం వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు వైద్యులు. నిమ్స్కు చేరుకున్న తర్వాత వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ప్రీతి శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయి. మెదడుపైనా ప్రభావం పడిందనే వైద్యుల మాట. అందువల్లే ఆమెను కాపాడలేకపోయామని అంటున్నారు.
ఇప్పుడు ప్రీతి మరణానికి కారణాలేంటో చెప్పాలని ప్రీతి కుటుంబం డిమాండ్ చేస్తోంది. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని చంపేశారని తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రీతి నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఏం జరిగిందో చెప్పాలని ఆమె సోదరి డిమాండ్ చేస్తోంది. ట్సాక్సికాలజీ పరీక్షల రిపోర్ట్ వస్తేనే ప్రీతి ఎలా చనిపోయిందో తెలుస్తుంది.