Modi :ఆన్ లైన్ లో వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఈ-సంజీవని. ఈ యాప్ ను వినియోగించుకునే యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 98వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ యాప్ అందిస్తున్న సేవలను ప్రస్తావించారు. ఇప్పటి వరకు 10 కోట్లమందిపైగా సేవలు పొందారని తెలిపారు. భారత్ లో డిజిటల్ విప్లవం సక్సెస్ కు ఈ యాప్ నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు.
ఈ- సంజీవని యాప్ సేవలపై సిక్కింకు చెందిన ఓ డాక్టర్ తో మోదీ మాట్లాడారు. సామాన్యులకు , మారుమూల ప్రాంతాలవారికి ఈ -సంజీవని ప్రాణరక్షక యాప్ గా మారుతోందని అన్నారు. దేశంలో డిజిటల్ పరంగా అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. భారత్ కు చెందిన యూపీఐ, సింగపూర్ పే నౌ మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని ప్రధాని మోదీ ప్రశంసించారు. సర్ధార్ పటేల్ జయంతిని పురష్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించిన పాటలు, ముగ్గుల పోటీల విజేతలను ప్రకటించారు. దేశభక్తి గీతాల పోటీలో ఏపీకి చెందిన విజయదుర్గ విజేతగా నిలిచారని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో ఆమె దేశభక్తి పాటను రాశారని వివరించారు. తెలంగాణలో పేరిణి ఒడిస్సీ నృత్యప్రదర్శనలు నిర్వహించిన రాజ్ కుమార్ నాయక్ ను ప్రశంసించారు. కాకతీయుల కాలంలో ఈ పేరిణి నాట్యం బాగా ప్రాచుర్యం పొందినట్లు గుర్తుచేశారు.
స్వచ్ఛ భారత్ ఉద్యమంగా మారిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు అనుసరిస్తోన్న పరిశుభ్రత చర్యలను వివరించారు. ఒడిశాకు చెందిన కమలా మోహరనా బృందం ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి బుట్టలు, మొబైల్ ఫోన్ స్టాండ్ల లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ కు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.