Preethi : మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషంగానే ఉంది. తాజాగా నిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ , ఎక్మోపై చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. కిడ్నీల పనితీరు మెరుగుపర్చేందుకు
డయాలసిస్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షిస్తోందని వివరించారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి తన తల్లితో ఫోన్ లో మాట్లాడారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. ఈ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తల్లి, కుమార్తె మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్ గా మారింది. సైఫ్ తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని ప్రీతి తల్లికి చెప్పింది.
తల్లితో ప్రీతి ఏం మాట్లాడిందంటే..?
” సీనియర్లంతా ఒక్కటిగా ఉన్నారు. నాన్న పోలీసులతో చెప్పించినా ఉపయోగంలేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరుతున్నాయి. నేను ఫిర్యాదు చేస్తే సీనియర్లు అందరూ కలిసి నన్ను దూరం పెడతారు. ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంపై హెచ్ వోడీ నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు”. ఇలా తన బాధనంతా ప్రీతి తల్లికి చెప్పింది. కుమార్తె ఆవేదన విన్న తల్లి.. తాను సైఫ్ తో మాట్లాడతానని చెప్పింది. ఈ లోపే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్ల ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.